Tirumala laddu Adulterated Ghee: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ మునిగిపోయిందా? కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన వాటిపై సిట్ వేస్తే.. సీబీఐతో విచారణ జరిపించాలని పదేపదే డిమాండ్ చేస్తోంది. మరి తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎందుకు సైలెంట్ అయ్యింది? సీబీఐ సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయా? వైసీపీ హయాంలో ఏకంగా 20 కోట్ల లడ్డూలు కల్తీ అయ్యాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కొత్త విషయాలు
తిరుమల పేరు చెబితేచాలు చాలామంది మనసు పులకరిస్తుంది. ఎప్పుడు ఆ క్షేత్రానికి వెళ్దామా? అనే భావించేవాళ్లు ఎక్కువగా ఉంటారు. స్వామి సన్నిధికి వెళ్తే చేసిన పాపాలు కొంతైనా తొలగుతాయని భావిస్తుంటారు భక్తులు. అలాంటి క్షేత్రంలో పరమ పవిత్రంగా భావించే స్వామి ప్రసాదం లడ్డూ కల్తీ అయితే చెప్పడానికి ఏమీలేదు. పాలకులపై ప్రజలకు నమ్మకం పోతోంది. ఆ తర్వాత ఎంత చెప్పినా వినరు. ఇప్పుడు అదే జరిగింది. వైసీపీ హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ హయాంలో దాదాపు 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారైనట్టు సిట్ విచారణలో బయటపడింది.
వైసీపీ హయాంలో 2019-24 మధ్య దాదాపు 20 కోట్ల శ్రీవారి లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేసినట్టు సీబీఐ సిట్ తేల్చింది. ఐదేళ్ల కాలంలో 48.76 కోట్ల లడ్డూలు తయారు చేసింది టీటీడీ. అందులో 40 శాతం పామాయిల్-పామ్కెర్నల్-ఇతర రసాయనాలు కలిపినట్టు నిర్ధారణ అయ్యింది. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీకి నెయ్యి సరఫరాను నాలుగు డెయిరీలు చేశాయి. అందులో ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డెయిరీ, తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డెయిరీ, తిరుపతి జిల్లా పునబాకలోని వైష్ణవి డెయిరీ, యూపీకి చెందిన మాల్గంగ డెయిరీలు ఉన్నాయి.
20 కోట్ల లడ్డూలు కల్తీ అయ్యాయా?
రూ.250 కోట్లు చెల్లించి మరీ నెయ్యిని రప్పించారు అప్పటి పాలకులు. ఆయా డెయిరీల నుంచి దాదాపుగా 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేసింది టీటీడీ. అందులో 68 లక్షల కిలోల నెయ్యి కల్తీ అయి నట్టు తేలింది. ఆ లెక్కన దాదాపు 20 కోట్ల లడ్డూలు కల్తీ అయ్యాయి. శ్రీవారి ఆలయంలో ప్రతీ రోజూ 3 నుంచి 4 లక్షల లడ్డూలు తయారవుతాయి. దీనికి 12 నుంచి 13 వేల కిలోల నెయ్యి ఉపయోగిస్తారు. అంటే ఆ లెక్కన లడ్డూల తయారీకి 40 శాతం కల్తీ నెయ్యిని వినియోగించినట్టు తేలింది. తిరుమలలో తయారు చేసిన లడ్డూలు చివరకు అయోధ్య వరకు వెళ్లాయి కూడా.
ALSO READ: అరటి రైతులకు బిగ్ రిలీఫ్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రియాక్ట్ అయ్యారు. నెయ్యి కల్తీ విషయంలో టీటీడీ పాలక మండలి-అధికారులు కుమ్మక్కై భారీ అవినీతికి పాల్పడినట్టు వ్యాఖ్యానించారు. కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఘాటుగా వ్యాఖ్యానించారు. తిరుమలలో జరిగిన మరిన్ని అక్రమాలను త్వరలో బయటకు తెస్తామని చెప్పకనే చెప్పారాయన. మొత్తానికి తిరుమల కేంద్రంగా వైసీపీ చేసిన ఆగడాలు బయటకు వస్తున్నాయి. ఈ క్షేత్రాన్ని సర్వనాశనం చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.