బెంగళూరులో నిన్న కేటీఆర్, జగన్ కలసిన ఫొటోలను వైసీపీ, బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేశాయి. వారిద్దరికీ ఎక్కడలేని ఎలివేషన్లు ఇచ్చారు. తాజాగా రేవంత్, చంద్రబాబు కలసి ఉన్న ఫొటోలను టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు హైలైట్ చేస్తున్నాయి. వీరిద్దరికీ ఎలివేషన్లు ఇస్తున్నాయి. ఇటీవలే రామోజీరావు జయంతి కార్యక్రమంలో కలసి పాల్గొన్న చంద్రబాబు, రేవంత్ రోజుల వ్యవధిలోనే సత్యసాయి శతజయంతి కార్యక్రమంలో కూడా పక్కపక్కనే కలసి కూర్చుని ముచ్చటించుకున్నారు. ఈఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ వారిద్దరు, ఇక్కడ వీరిద్దరు.. ఈ జోడీలతో పొలిటికల్ హడావిడి మొదలైంది. జగనన్నని కలిశాను అంటూ స్వయంగా కేటీఆర్ తమ ఇద్దరి ఫొటోల్ని హైలైట్ చేసుకోవడం విశేషం.
Was great meeting @ysjagan Anna at a private event in Bengaluru pic.twitter.com/8Ix5wPzr8M
— KTR (@KTRBRS) November 23, 2025
అప్పుడు శత్రువులు..
2010 మే నెలలో వరంగల్ జిల్లా మానుకోట రైల్వే స్టేషన్లో జగన్ పై రాళ్లదాడి జరిగింది. ఆ దాడిలో ప్రస్తుత తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ఆయన భర్త కొండా మురళి సహా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అప్పట్లో దాడి వెనక ఇప్పటి బీఆర్ఎస్ నేతలున్నారనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు జగన్ అదే బీఆర్ఎస్ కి మిత్రుడులా మారిపోయాడు. కొండా సురేఖ వంటి నేతలు కాంగ్రెస్ లోనే ఉండటంతో జగన్ కి అనివార్యంగా శత్రువులయ్యారు. తెలంగాణలో వైసీపీ ఎప్పుడైతే పోటీ నుంచి విరమించుకుందో, అప్పుడే బీఆర్ఎస్ కి జగన్ మిత్రుడిగా మారారు. తెలంగాణలో జగన్ ని అభిమానించేవారు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ బీఆర్ఎస్ కే మద్దతిస్తుంటారు. ఒక పార్టీకి చెందిన మీడియా, సోషల్ మీడియా విభాగం ఇంకో పార్టీతో సఖ్యతగా ఉంటుంది.
జగన్, కేసీఆర్ కి ఉమ్మడి శత్రువులు కాంగ్రెస్, టీడీపీ. ఆ రెండు పార్టీలు అక్కడ ఆ పార్టీకి, ఇక్కడ ఈ పార్టీకి ఉమ్మడి శత్రువులు. అందుకే వారిద్దరినీ టార్గెట్ చేసే క్రమంలో వీరిద్దరూ మిత్రులుగా మారిపోయారు. అప్పట్లో కేసీఆర్, జగన్ తరచూ కలసుకొనేవారు. ఇప్పుడు జగన్, కేటీఆర్ కలయిక రెండు పార్టీల్లోనూ సంతోషం నింపుతోంది. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపకపోవడం విశేషం. కేవలం రాజకీయ అవసరాల కోసమే వారిద్దరూ స్నేహితులయ్యారని అంటారు.
బాబు, రేవంత్..
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిది గురుశిష్యుల బంధం. ఇప్పటికీ టీడీపీలోని చాలామంది రేవంత్ రెడ్డిని అభిమానిస్తుంటారు. తమ పార్టీనుంచి బయటకు వెళ్లిపోయినా ఆయన్ను గౌరవిస్తారు. అటు రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు పట్ల ఎప్పుడూ మాట తూలలేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబుని తిట్టి ఓట్లు రాబట్టాలనుకునేవారు కేసీఆర్. హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో అవసరం లేకపోయినా చంద్రబాబుని విలన్ లా చూపించి ప్రజలనుంచి మద్దతు కోరుతుంటారు కేసీఆర్. కేటీఆర్ కూడా అదే అలవాటు చేసుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల సమయంలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలనుకోరు. అందుకే ఆయనకు తెలంగాణలో టీడీపీ శ్రేణుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరులు, మద్దతుదారులు కాంగ్రెస్ అభ్యర్థికి అండగా నిలబడ్డారు.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
CM Revanth Reddy at Sri Satya Sai Baba’s 100th Birthday at Puttaparthi#RevanthReddy #Telangana pic.twitter.com/Rj6P653Wul
— Congress for Telangana (@Congress4TS) November 23, 2025
ఫ్యాన్ వార్..
కేటీఆర్-జగన్ మైత్రి అందరికీ తెలుసు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న గురుశిష్యుల సంబంధం కూడా అందరికీ తెలుసు. అయితే ఒక పార్టీని ఇంకొకరు రెచ్చగొట్టుకునే విధంగా ఇప్పుడు నాలుగు పార్టీల మధ్య ఫ్యాన్ వార్ మొదలైంది. తాజాగా కేటీఆర్-జగన్ కలసిన ఫొటోల్ని వైసీపీ, బీఆర్ఎస్ వైరల్ చేస్తున్నాయి. వారికి పోటీగా చంద్రబాబు-రేవంత్ రెడ్డి కలసి ఉన్న ఫొటోల్ని టీడీపీ, కాంగ్రెస్ సోషల్ మీడియా సైనికులు హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఫొటోల వల్ల ఏ పార్టీకి లాభం ఉండదు. కానీ పోటా పోటీగా మాత్రం ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: జగన్ తో కేటీఆర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మీటింగ్