జగన్, కేటీఆర్. వీరిద్దరి కలయిక కొత్తదేమీ కాదు, గతంలో చాలాసార్లు కలుసుకున్నారు, అధికారంలో ఉన్నప్పుడు రాకపోకలు బాగానే ఉండేవి. కానీ ఇద్దరూ ఇప్పుడు అధికారానికి దూరమయ్యారు. ప్రతిపక్షంలో ఉండగా పెద్దగా కలుసుకున్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఇద్దరూ బెంగళూరులో ఒకేచోట చేరారు. ఉద్దేశపూర్వకంగా కలిశారా, లేక అనుకోకుండా ఒకే ఫంక్షన్లో పక్క పక్కన కూర్చున్నారా తెలియదు కానీ, వీరిద్దరూ బెంగళూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కలసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేటీఆర్తో జగన్
బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై
సంభాషించిన మాజీ సీఎం జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/ZAh1NOk59k— BIG TV Breaking News (@bigtvtelugu) November 22, 2025
ఓవర్ కాన్ఫిడెన్స్..!
జగన్, కేటీఆర్. దాదాపుగా ఇద్దరి పరిస్థితి ఒకటే. ఇద్దరూ ఊహించని పరాజయాలను చవిచూశారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇద్దరూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండేవారని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో మూడోసారి అధికారం తమదేనని చెప్పుకునేవారు కేటీఆర్. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఢంకా భజాయించేవారు. కానీ జనం కేసీఆర్ ని పక్కనపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో పొరపాటు చేశారు కానీ, లోక్ సభ ఎన్నికల్లో అయినా ఓట్లేయండి అని ఘరానాగానే అడిగారు బీఆర్ఎస్ నేతలు. ఈసారి మరింత ఘాటుగా సున్నా చుట్టారు. అయినా కేటీఆర్ లో మార్పు రాలేదనే అంటారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం మనదేనంటూ ప్రచారంలో జోరు చూపించారు. కానీ జనం నవీన్ యాదవ్ వైపు నిలబడ్డారు. ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం కేటీఆర్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టుగా ఉంది. ఈ టైమ్ లో కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఆయన బెంగళూరు వెళ్లినట్టు, అక్కడ జగన్ ని కలసినట్టు చెబుతున్నారు.
జగన్ దీ అదే పరిస్థితి..
తెలంగాణలో కనీసం ప్రతిపక్షానికి ఒకట్రెండు సీట్లయినా వస్తాయని అంచనా వేసేవారు బీఆర్ఎస్ నేతలు. కానీ ఏపీలో పరిస్థితి అది కాదు. జగన్ వైనాట్ 175 అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ కూడా ఓడిపోతారు, అందులో డౌటేం లేదంటూ ఇంటర్వ్యూలు చేసిన ప్రతి జర్నలిస్ట్ కీ చెప్పేవారు జగన్. 175కి 175 స్థానాల్లో గెలిచి తీరుతామన్నారు, చివరకు 11 సీట్లతో సరిపెట్టారు జనం. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయే సరికి జగన్ అలిగి అసెంబ్లీకే రావడం మానేశారు.
కేరాఫ్ బెంగళూరు..
ఏపీలో ఘోర పరాభవం తర్వాత జగన్ బెంగళూరుకి మకాం మార్చారు. కేవలం వీకెండ్స్ లో మాత్రమే ఏపీకి వచ్చి వెళ్తున్నారు. ఇటీవల అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరయ్యేందుకు చాలాకాలం గ్యాప్ తర్వాత హైదరాబాద్ లో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఆయన బెంగళూరుకి వచ్చారు. అలా వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి కేటీఆర్ కూడా బెంగళూరు వచ్చి ఇలా ప్రైవేట్ పార్టీలో జగన్ ని కలిశారు.
జగన్, కేసీఆర్ కి చంద్రబాబు ఉమ్మడి శత్రువు. అందుకే వారిద్దరి మధ్య స్నేహం బలంగా ఉండేది. ఇప్పుడు జగన్-కేటీఆర్ మధ్య కూడా అదే బాండింగ్ ఉంటుంది. జగన్ సొంత పత్రిక, ఛానెల్ లో ఎప్పుడూ బీఆర్ఎస్ కి వ్యతిరేక వార్తలు రావు, అటు తెలంగాణలో బీఆర్ఎస్ అనుకూల మీడియా, సోషల్ మీడియా జగన్ ని పల్లెత్తు మాట అనదు. చంద్రబాబుని మాత్రం ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తుంది. పరస్పర లాభం కోసం ఇద్దరు నాయకులు ప్రయత్నిస్తుంటారు. కానీ కాలం కలసిరాక ఇప్పుడు ఇద్దరూ ఓటమి బారిన పడ్డారు. మరి వీరిద్దరూ బెంగళూరులో ఏం చేస్తున్నారు. గెలుపు వ్యూహాలు రచిస్తున్నారా? అసలింతకీ వీరిద్దరూ ఓటమి పాఠాలు నేర్చుకున్నరా?