Amaravati: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు వివిధ రాష్ట్రాలు ముఖ్యమంత్రులు పొదుపు చర్యలు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఓ అడుగు ముందుకేశారు. ఇంధన పొదుపు చర్యలలో భాగంగా తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని అధికారులను ఆదేశించారు.
మోదీ పిలుపుతో యూపీ, గుజరాత్, ఆ తర్వాత ఏపీ
ఇరాన్పై అమెరికా యుద్ధం ప్రభావం అన్ని రంగాలపై క్రమంగా పడుతోంది. విదేశీ నిల్వలు తరిగిపోకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ సభలో ప్రధాని నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పొదుపు చర్యలు తప్పవని, ఈవీ వాహనాలను వినియోగించాలని సూచన చేశారు. చెప్పడమే కాదు తన నుంచి పొదుపు మొదలుపెట్టారు ప్రధాని మోదీ.
తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను కుదించుకున్నారు. కేవలం రెండు వాహనాల కాన్వాయ్లో ఆయన ప్రయాణించారు. నార్మల్గా అయితే ప్రధాని కాన్వాయ్లో 12 నుంచి 15 వరకు వాహనాలు ఉంటాయి. ఆ సంఖ్యను సగానికి పైగా కుదించారు. అంతేకాదు కొన్ని ఈవీ వాహనాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
సీఎం చంద్రబాబు కాన్వాయ్లో వాహనాల కుదింపు
బుధవారం కేబినెట్ సమావేశంలో పొదుపు చర్యలు మొదలుపెట్టాలని కేంద్రమంత్రులకు సూచన చేశారు ప్రధాని. ప్రధాని బాటలో బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగులు వేస్తున్నారు. యూపీ, గుజరాత్తోపాటు ఇప్పుడు ఏపీ కూడా అదే దారిలో అడుగులు వేస్తోంది.
బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబు.. డీజీపీ హరీష్ ఉప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ సహా సీనియర్ పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో కాన్వాయ్లో వాహనాల సంఖ్య తగ్గించాలని, దీన్ని వెంటనే అమల్లోకి రావాలని అధికారులకు సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలని పొదుపు చర్యలను ప్రోత్సహించాలని ప్రధాని పిలుపును సీఎం ప్రశంసించారు.
ALSO READ: ఏపీలో స్థానిక ఎన్నికల హంగామా, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష, సెప్టెంబర్లో నోటిఫికేషన్!
మా కాన్వాయ్ల్లో వాహనాల సంఖ్యను తగ్గించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు. జిల్లాల్లో పర్యటించేటప్పుడు కాన్వాయ్లలోని వాహనాలను సగం తగ్గించాలని అధికారులకు స్పష్టం చేశారు. మంత్రులు, ఇతర వీఐపీలు సాధ్యమైనంత తక్కువగా వాహనాలను వినియోగించేలా చూడాలన్నారు. అన్నిస్థాయిల్లో సగం వాహనాలు ఉండేలా చూడాలని అన్నారు.
ఇంధన పరిరక్షణ, వనరుల సమర్థవంతమైన వినియోగం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, అధికారిక వ్యయాలలో పొదుపును ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు విధానపరమైన చర్యలను పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనలపై గురువారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు సీఎం చంద్రబాబు.