Petrol Diesel shortage: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇంధన కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంపై ఆదివారం ఆయన ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా రేపటిలోగా (సోమవారం కల్లా) ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని సీఎం కఠిన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రాకుండా చూడాలని, వ్యవసాయ పనులకు ఆటంకం కలగకూడదని ఆయన స్పష్టం చేశారు.
ఆయిల్ కంపెనీల తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కంపెనీలు ఉన్నపళంగా పాలసీలను మార్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆయన ప్రశ్నించారు. అసంబద్ధ నిర్ణయాల వల్ల సామాన్యులు ఇబ్బంది పడితే సహించేది లేదని హెచ్చరించారు. సమస్యను ముందుగానే గుర్తించినప్పటికీ, ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన సంక్షోభాన్ని తక్షణమే చక్కదిద్దేందుకు ఒక టాస్క్ఫోర్స్, కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర రద్దీ నెలకొనడం, కొన్ని చోట్ల ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రతి బంక్ వద్ద రెవెన్యూ.. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, బ్లాక్ మార్కెటింగ్కు తావులేకుండా చూడాలని ఆదేశించారు. రేపటికల్లా ఏ బంక్ వద్ద కూడా ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బంకుల యాజమాన్యాలకు కీలక సూచనలు చేశారు. డ్రమ్ములు, క్యాన్లు పట్టుకొచ్చే వారికి ఇంధనం పోయవద్దని, కేవలం వాహనాలకు మాత్రమే సరఫరా చేయాలని స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బంకులలో రేషనింగ్ పద్ధతిని అమలు చేస్తున్నారు. టూ వీలర్లకు 2 లీటర్లు, కార్లకు 15 లీటర్లు, లారీలకు 50 లీటర్లు, భారీ వాహనాలకు గరిష్టంగా 100 లీటర్ల పరిమితిని విధిస్తున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో ఆయిల్ కంపెనీలు సరఫరాను పెంచేందుకు చర్యలు ప్రారంభించాయి. సోమవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా ఇంధన లభ్యత మెరుగుపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్.. అవార్డు అందుకున్న ఏపీ సీఎం చంద్రబాబు