CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్న ‘‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం’’ పై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్సు డేటా లేక్ ద్వారా వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందిస్తున్న వివిధ పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం ఒక యూనిట్గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంను అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారిత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలన్నారు. వచ్చే ఏడాది జూన్లోగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని సీఎంం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు 2026 జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. 25 రకాల వివరాలతో పీ4 లాంటి అంశాలను ఆ కార్డులో పొందుపర్చాలన్నారు. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారంతో ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలన్నారు. స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలన్నారు. ఆధార్, ఎఫ్బీఎంఎస్ ఐడీ, కుల ధృవీకరణ, వాక్సినేషన్, పౌష్టికాహారం, రేషన్ కార్డు, స్కాలర్షిప్, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించి పూర్తి ఫ్యామిలీ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలన్నారు.
Also Read: Pawan Kalyan: మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్.. ఆలయానికి 30 ఎకరాల భూమి
కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో భాగంగా ఫ్యామిలీ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించడం, సులభంగా పౌర సేవలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లను ఈ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలన్నారు. ఈ ఒక్క కార్డుతో అన్ని వివరాలు తెలిసేలా రూపొందించాలని సీఎస్, అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.