Neopolis Kokapet: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) నియోపోలిస్ కోకాపేట్లో అతిపెద్ద భూముల వేలంపాట షురూ అయ్యింది. మొదటి రెండు దశల్లో వేలం ప్రక్రియ సజావుగా జరిగిన తర్వాత.. డెవలపర్లు ఫేజ్- 3 ఈ-వేలంపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు.
ఫేజ్- 3 వేలం వివరాలు
నియోపోలిస్ కోకాపేట్ ఫేజ్ 3 వేలం నాలుగు రోజుల్లో పూర్తి కానుంది. మొత్తం 25 ఎకరాల వాణిజ్య భూమిని HMDA ఈ దశలో వేలం వేయనుంది. ఈ వేలం నవంబర్ 24, 28, డిసెంబర్ 3, 5 తేదీల్లో జరుగుతుంది. ఈ కీలకమైన వేలం కోసం 85 మందికి పైగా డెవలపర్లు ఇప్పటికే ఆసక్తి చూపారు. ఈ అధిక డిమాండ్ కారణంగా HMDA పోటీతత్వ బిడ్డింగ్ను ఆశిస్తోంది. ఈ రోజు 9.9 ఎకరాల భూమిని వేలం వేశారు..
ప్రభుత్వ వేలంలో రికార్డు స్థాయి ధర
అయితే.. ఈ రోజు హైదరాబాద్లోని కోకాపేట ప్రాంతంలో భూముల ధరలు మరోసారి రికార్డు సృష్టించాయి. తాజాగా సోమవారం జరిగిన వేలంలో ఎకరం ధర అత్యధికంగా రూ.137.25 కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్ 17, 18 స్థలాల వేలంలో ఈ రికార్డు ధర నమోదైంది. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాల చొప్పున మొత్తం 9.9 ఎకరాల భూమిని వేలం వేశారు. ఈ 9.9 ఎకరాల భూమి ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ.1355.33 కోట్ల ఆదాయం వచ్చింది.
డెవలపర్ల ఆసక్తికి గల కారణాలివే..
నియోపోలిస్ కోకాపేట్ హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ జోన్లలో ఒకటిగా ఉంది. డెవలపర్లు ఇక్కడ భూములు కొనుగోలు చేయడానికి ముఖ్యంగా మూడు కారణాల వల్ల ఇంట్రెస్ట్ చూపుతున్నారు.
1.ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు చాలా దగ్గరగా ఉంది.
2. గత వేలం తర్వాత ఈ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరిగాయి.
3. గతంలో జరిగిన వేలం దశల్లో కూడా బిడ్డింగ్ చాలా పోటాపోటీగా జరిగింది.
ఈ ప్లాట్లు ప్రధానంగా హై-రైజ్ వాణిజ్య ప్రాజెక్టులకు, మిశ్రమ-వినియోగ నిర్మాణాలకు చాలా అనుకూలంగా ఉన్నాయి.
కోకాపేట్ వేలం చరిత్ర
కోకాపేట్లో గతంలో రెండు విజయవంతమైన వేలం దశలు జరిగాయి.
1. ఫేజ్ 1 (జూన్ 2021): ఈ దశలో 49 ఎకరాల భూమిని వేలం వేశారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.2,000 కోట్లు ఆదాయం వచ్చింది.
2. ఫేజ్ 2 (ఆగస్టు 2023): 46 ఎకరాల వేలం జరిగింది. దీని ద్వారా వచ్చిన ఆదాయం రూ.3,300 కోట్లు.
3. ఫేజ్ 3లో ఇప్పటి వరకు 9.9 ఎకరాల భూమిని వేలం వేశారు. ఈ 9.9 ఎకరాల భూమి ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ.1355.33 కోట్ల ఆదాయం వచ్చింది.
మొదటి రెండు దశల్లో కలిపి మొత్తం 95 ఎకరాల భూమి వేలం జరిగింది. ఇప్పుడు ఫేజ్-3లో 25 ఎకరాలు వేలం వేయడం ద్వారా నియోపోలిస్ కోకాపేట్లో మొత్తం 120 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేసినట్టు అవుతుంది. ఈ మూడు దశల వేలం పూర్తి అయిన తర్వాత కోకాపేట్ మరింత కీలక వాణిజ్య కేంద్రంగా మారే అవకాశం ఉంది.
ALSO READ: IBomma Ravi: వామ్మో ఇదేం క్రేజ్ సామీ.. ఐ బొమ్మ రవికి మద్దతుగా పొట్టపై టాటూ..