Chandrababu Naidu CII summit: ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) బిజినెస్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. సీఐఐతో తనకు దశాబ్దాల కాలంగా ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. దేశ ప్రయోజనాలు.. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా తాను పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్.. టెక్నాలజీ.. ట్రస్ట్.. స్పీడ్ అనే అంశాలపైనే గట్టి పోటీ నెలకొందని.. వీటిని అందిపుచ్చుకున్న దేశాలే అగ్రగామిగా నిలుస్తాయని ఆయన విశ్లేషించారు. 1990లో వచ్చిన ఆర్థిక సంస్కరణలను అందిపుచ్చుకుని భారత్ నేడు ఈ స్థాయికి చేరుకుందని.. అందులో తాను కూడా భాగస్వామిని కావడం సంతోషంగా ఉందన్నారు.
ప్రస్తుతం భారత్ అగ్రస్థానానికి చేరుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం ఎంతో దోహదపడుతోందని చంద్రబాబు ప్రశంసించారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు లభించారని ఆయన పేర్కొన్నారు. టెలికాం డీరెగ్యులేషన్.. ఓపెన్ స్కై పాలసీ.. విద్యుత్ సంస్కరణల వంటి విప్లవాత్మక మార్పులు దేశంలో ఎన్నో ఆవిష్కరణలకు దారితీశాయన్నారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఉండటం వల్ల పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పడిందని.. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు సానుకూల ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. గతంలో అభివృద్ధికి ఆదర్శంగా ఉన్న బెంగాల్.. మధ్యలో కొంతకాలం ఆలోచనలు లేకుండా పోయిందని.. ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోందని అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోదీ ప్రకటించిన 8 అంశాల నేషనల్ మిషన్ గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి ఇల్లు.. ప్రతి పొలం.. ప్రతి పరిశ్రమ ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంధనాన్ని పొదుపుగా వాడుతూ స్వయం సమృద్ధిని సాధించాలని కోరారు. యుద్ధానంతర పరిస్థితుల్లో గ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు మనకు మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్.. గ్రేటర్ సెల్ఫ్ రిలయన్స్.. ప్రకృతి సేద్యం వంటి నినాదాలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని చెప్పారు. ప్రకృతి సేద్యం వల్ల ఎరువుల దిగుమతులు తగ్గి.. రైతులకు లాభం చేకూరుతుందని వివరించారు. భారత్ ఇక ‘అన్స్టాపబుల్’ అని.. త్వరలోనే గ్లోబల్ జెయింట్గా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే ‘ప్రోజ్యూమర్’ (Prosumer) విధానాన్ని పాటిస్తోందని చంద్రబాబు వివరించారు. సోలార్ రూఫ్ టాప్స్ ద్వారా ప్రజలే విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని.. మైక్రో గ్రిడ్ వ్యవస్థ ద్వారా ట్రాన్స్మిషన్ నష్టాలను తగ్గిస్తున్నామని చెప్పారు. ఏపీలో ప్రస్తుతం 20 లక్షల మంది రైతులు.. 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారని వెల్లడించారు. దీనివల్ల భూసారం పెరగడమే కాకుండా.. ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో సర్టిఫికేషన్.. ట్రేసబిలిటీ లభిస్తాయన్నారు. గ్రీన్ ఎనర్జీ.. బయో గ్యాస్.. ఇథనాల్.. ఈవీ రంగాల్లో ఏపీ అగ్రగామిగా నిలిచేందుకు సిద్ధంగా ఉందని.. పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరారు.
Read Also: కేంద్రం కీలక నిర్ణయం.. తమిళనాడు సీఎం విజయ్కి Z+ భద్రత