CM Chandrababu: ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి రెండేళ్లు కావస్తోంది. అయినా కొందరు మంత్రులు ఏ మాత్రం మారడం లేదు. పదే పదే సీఎం చంద్రబాబు వారిని హెచ్చరిస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఈసారి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వంతు అయ్యింది. అసలు ఏం జరిగింది?
మంత్రి కొండపల్లిపై సీఎం చంద్రబాబు సీరియస్
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల నుంచి మంత్రులను పదేపదే హెచ్చరిస్తున్నారు సీఎం చంద్రబాబు. మంత్రుల కంటే వారి పర్సనల్ సెక్రటరీ, కుటుంబసభ్యుల జోక్యం విపరీతంగా పెరుగుతోందని చెప్పారు. అయినా కొందరు మంత్రులు ఏ మాత్రం మారడం లేదు. ఫలితంగా మంత్రుల కుటుంబాల జోక్యం పెరిగిపోవడం మొదలైంది. చివరకు ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో గట్టిగా మందలించారు.
చంద్రబాబు కేబినెట్లో విజయనగరం జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు కొండపల్లి శ్రీనివాస్. తొలిసారి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే ఆయనకు సంబంధించి ఓ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ తండ్రి జోక్యం విపరీతంగా పెరిగింది.
అధికార కార్యక్రమాల్లో మంత్రి తండ్రి జోక్యంపై ఆగ్రహం
రాజకీయాలకు తన తండ్రిని దూరంగా పెట్టాలని హెచ్చరించారు సీఎం. దీనికి సంబంధించి తన వద్ద నివేదికలు ఉన్నాయని ప్రస్తావించారు. వెంటనే జోక్యం చేసుకున్న శ్రీనివాస్, ఆరు నెలలుగా ఏ వ్యవహారంలోనూ తన తండ్రి జోక్యం చేసుకోవడం లేదని చెప్పే ప్రయత్నం చేశారట. అంతకుముందు జోక్యం చేసుకున్నారనే భావన చెప్పకనే చెప్పారు.
ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రిని చేశానని, పని తీరు మార్చుకోవాలని మందలించారు ముఖ్యమంత్రి. పార్టీకి కంచుకోట లాంటి జిల్లాలో వ్యక్తిగతంగా పార్టీ పరంగా ప్రగతి చూపాలని సూచన చేశారట. అందరిని కలుపుకొని ముందుకెళ్లాలని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారట సీఎం చంద్రబాబు.
ALSO READ: అమరావతిపై తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నారో తెలుసా?
ఇటీవల మంత్రుల పనితీరు, నియోజకవర్గాల్లో వ్యవహరించిన తీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించడం, వారిని మందలించడం జరుగుతోంది. రెండేళ్లు గడిచినా పలువురు మంత్రుల తీరు ఏ మాత్రం మారలేదు.