CM Chandrababu In Assembly: తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ప్రాజెక్టులపై మరోసారి ఇద్దరు ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కానున్నారా? ఈసారి నల్లమల సాగర్ ప్రాజెక్టు గురించి ఏపీ ప్రస్తావించనుందా? అటు తెలంగాణ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతోపాటు పలు ప్రాజెక్టుల గురించి ప్రస్తావించనుందా? అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు ఏమన్నారు? ఇంకాస్త డీటేల్స్లోకి వెళ్తే..
సీఎం రేవంత్ ప్రతిపాదన ఏపీ గ్రీన్ సిగ్నల్
శుక్రవారం ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రాజెక్టులపై ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనపై స్పందించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. నల్లమలసాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడటం సరైంది కాదన్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలుంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సముద్రంలోకి పోయే నీళ్లు నల్లమల సాగర్ ద్వారా వెలిగొండకు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నామన్నారు. దీనిపై కేంద్రం వద్ద ప్రస్తావించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని దానికి తాము సపోర్టు చేశామన్నారు.
అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు రియాక్ట్
పోయిన ఏడాది 5 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోయాయన్నారు. కృష్ణా నది నుంచి 1500 నుంచి 1600 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఐదువేల టీఎంసీలు పోయాయని, అందులో 200 టీఎంసీలు నీళ్లు తీసుకుని కరువు ప్రాంతాలకు పంపిస్తే గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. నీటి సమస్య ఉండదన్నారు. ఆ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఇది కరెక్టు కాదన్నారు.
తెలుగు జాతి బాగుండాలన్నారు. సీఎం మాట్లాడిన మాటలు విన్నామని, మాకు ఒకటి రెండు సమస్యలు పరిష్కారం చేస్తే తాము సహరిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పులేదని, రెండు రాష్ట్రాల సమస్యలుంటే కూర్చొని మాట్లాడటానికి మా ప్రభుత్వానికి ఏ మాత్రం అభ్యంతరం లేదన్నారు. నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అడ్డుపడడం సరికాదని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు.
ALSO READ: వైసీపీ ఎమ్మెల్యేలు రభసపై పవన్ ఆగ్రహం.. హనుమంతుడి ముందు కుప్పిగంతులంటూ
గురువారం ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్బంగా ఏపీతో ఉన్న జలవివాదాలను పరిష్కరించుకోవడానికి మాకేమీ అభ్యంతరం లేదన్నారు. కృష్ణా-గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన వాటా ప్రకారం.. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఏపీ ఎన్ వోసీ ఇస్తే చాలన్నారు. వరద జలాలు వాడుకోవడానికి తాము అంగీకరిస్తామన్నారు.
గోదావరిలో మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నట్లు ఏపీ చెబుతోందన్నారు. గోదావరి ట్రైబ్యునల్ తెలంగాణకు కేటాయించిన 960 టీఎంసీలు వాడుకునేందుకు అభ్యంతరం లేదని ఎన్ వోవీ ఇవ్వాలన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా సమస్యలపై చర్చించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.