Appalanaidu on Jagan: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓర్పు లేదని.. అందుకే ఈ ప్రాంత ప్రగతిని అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ వల్లనే ఉత్తరాంధ్రలో ఐటీ రంగం, పరిశ్రమలు విస్తరిస్తున్నాయని కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో లోకేష్ చొరవ తీసుకుని కంపెనీలకు భూములు కేటాయిస్తుంటే.. దానిపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఉత్తరాంధ్రను ఉత్తుత్తి ఆంధ్రగా మార్చిన జగన్.. ఇప్పుడు అభివృద్ధిని చూసి కడుపుమంటతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రానికి తలమానికం వంటి గీతం యూనివర్సిటీపై వైసీపీ చేస్తున్న రాజకీయ బురదను ఎంపీ తీవ్రంగా ఖండించారు. గీతం సంస్థ 1980లో స్థాపించబడింది. ఆ సమయంలో జగన్ ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. విద్య, వైద్య రంగాల్లో గీతం అద్భుతమైన సేవలు అందిస్తోంది. ఇక్కడ చదువుకున్న లక్షల మంది విద్యార్థులు నేడు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అంతే కాకుండా.. విశాఖ కొండపై జగన్ నిర్మించుకున్న ప్యాలెస్కు ఎదురుగా గీతం యూనివర్సిటీ ఉండకూడదనే కుట్రతో గతంలో ఆ సంస్థను అనేక ఇబ్బందులకు గురిచేశారని కలిశెట్టి ఆరోపించారు.
ప్రకృతిని ధ్వంసం చేసి ప్యాలెస్లు కట్టుకోవడం జగన్ నైజమైతే.. భూములు కేటాయించి పరిశ్రమలు తీసుకురావడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగాలు రావడం జగన్ అండ్ కో కి ఇష్టం లేదని.. అందుకే పరిశ్రమలకు భూములిస్తే భూకబ్జాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఇలాంటి విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.