CM Chandrababu: పోలవరం-నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుపై మరోసారి నోరు విప్పారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదన్నారు. ఇప్పటికే తెలంగాణకు అప్పీల్ చేశామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మిగులు జలాలను ఇరు రాష్ట్రాలు వాడుకోవచ్చని తెలియజేశారు.
నోరు విప్పిన సీఎం చంద్రబాబు
సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు ఆదాయార్జన, కేంద్ర పథకాలు, పీపీపీ ప్రాజెక్టులపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు వర్చువల్గా హాజరై వివిధ అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే మంత్రులు, వివిధ శాఖల సెక్రటరీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.
కేంద్రం చొరవతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వేరే రాష్ట్రాలకు మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందన్నారు. మొదట ప్రారంభించిన పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పదేళ్లు బ్రహ్మాండంగా పని చేసిందన్నారు. 3 వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయని అన్నారు. 200 నుంచి 300 టీఎంసీలు పోలవరం నుంచి విశాఖకు తరలించవచ్చన్నారు.
ఆనాడు కాళేశ్వరం.. ఇప్పుడు పోలవరం-నల్లమల ప్రాజెక్టు
రూపాయి ఖర్చు చేయకుండా ఇరిగేషన్కు నీళ్లు ఇవ్వవచ్చన్నారు. పోలవరం-నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు గురించి మాట్లాడారు. దీనిపై తెలంగాణకు అప్పీల్ చేశానన్నారు. ఇది ఎవరికీ నష్టం లేని ప్రాజెక్టుగా చెప్పుకొచ్చారు. తెలంగాణ వదిలిన నీళ్లు పోలవరానికి వస్తాయని అన్నారు. పోలవరం నుంచి నల్లమలసాగర్కు నీళ్లు తీసుకుని వాడుకోవచ్చన్నారు.
అవసరమైతే సాగర్, శ్రీశైలంలో మిగిలిన జలాలను తెలంగాణ, రాయలసీమ వాడుకోవచ్చని సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించిందని గుర్తు చేశారు. దానికి ఏ విధంగా అడ్డంకులు సృష్టించలేదన్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ పనులు 67 శాతం పూర్తి అయినట్టు తెలిపారు.
ALSO READ: సొంతగడ్డపై సంక్రాంతి సంబరం, నారావారి పల్లెకు చంద్రబాబు ఫ్యామిలీ
కొత్త డయా ఫ్రం వాల్ పనులు దాదాపు 87 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయని, రాబోయే మార్చి నాటికి పూర్తి అవుతుందన్నారు. పుష్కరాల నాటికి ఈ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తామన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా వర్ణించారు.
సోమవారం సుప్రీంకోర్టులో నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై విచారణ జరగనుంది. ఈ ప్రాజెక్టు అడ్డుకునేందుకు రేవంత్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే అంశంపై ఆదివారం న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు మంత్రి నిమ్మల రామానాయడు. వృథాగా పోయే గోదావరి నీటిని వాడుకోవడమే లక్ష్యమని ఏపీ వాదిస్తోంది. ట్రిబ్యునల్కు విరుద్ధమంటూ తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ముందు ఇరు రాష్ట్రాల న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించనున్నారు.
నల్లమల సాగర్ ప్రాజెక్టు ఎవరికీ నష్టం కలిగించదు. వృథాగా వెళ్లే నీటిని వాడుకుంటే నష్టం ఏంటి ? కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మేము అభ్యంతరం చెప్పలేదు. తెలుగు జాతాంతా ఒకటే. కలిసి పని చేసుకోవాలి
– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు pic.twitter.com/n3wXaWC0Ny
— BIG TV Breaking News (@bigtvtelugu) January 12, 2026