CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత గ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలకు సిద్ధమయ్యారు. పండుగ పూట కుటుంబ సభ్యులతో కలిసి గడపడం ఆయనకు ఆనవాయితీ. ఈ క్రమంలోనే నేడు సాయంత్రం ఆయన గ్రామానికి చేరుకుని, మూడు రోజుల పాటు అక్కడే బస చేయనున్నారు. ఈ పర్యటన కేవలం పండుగ వేడుకలకే పరిమితం కాకుండా, గ్రామాభివృద్ధి దిశగా కీలక అడుగులు వేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
‘స్వర్ణ నారావారిపల్లె’ అభివృద్ధి లక్ష్యంలో భాగంగా ఈ నెల 13, 14 తేదీల్లో సీఎం పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అందులో ప్రధానంగా గ్రామస్థులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా నిర్మించిన 33/11 కేవీ ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్, మెరుగైన వైద్య సదుపాయాల కోసం నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు టాటా ఈ సంజీవిని ప్రాజెక్టు ద్వారా అత్యాధునిక వైద్య సేవలను గ్రామస్థులకు చేరువ చేయనున్నారు.
అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు, విశేషాల లింగేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్మించిన సీసీ రోడ్లను కూడా ప్రారంభించనున్నారు. ఇది భక్తులకు, స్థానికులకు రవాణా సౌకర్యాన్ని సులభతరం చేస్తుంది. ఆత్మీయ పలకరింపులు, పండుగ సందడి మధ్య గ్రామస్తులతో మమేకమవుతూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ పర్యటన ఒక వేదికగా నిలవనుంది.
Also Read: తీవ్ర విషాదం.. పుట్టబోయే బిడ్డ కోసం వచ్చి మృత్యుఒడికి చేరిన సైనికుడు!
ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం కృష్ణా జలాలను చంద్రగిరి ప్రాంతానికి తరలించడం. ఇందుకోసం మూలపల్లి చెరువు వద్ద సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలోని చెరువులను కృష్ణా నీటితో నింపి, భూగర్భ జలమట్టాన్ని పెంచడంతో పాటు రైతులకు సాగునీటి కష్టాలను తీర్చాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో నారావారిపల్లె పండుగ శోభతో పాటు సరికొత్త కళను సంతరించుకోనుంది.