Ramasethu History: భారతదేశాన్ని, శ్రీలంకను కలిపే రామసేతు (ఆడమ్స్ బ్రిడ్జ్) కేవలం ఒక భౌగోళిక నిర్మాణం మాత్రమే కాదు.. కోట్ల మంది భారతీయుల నమ్మకం, ఆరాధ్య దైవం శ్రీరాముడి చరిత్రకు సజీవ సాక్ష్యం. దశాబ్దాలుగా ఈ సేతువు చుట్టూ ఒకటే చర్చ జరుగుతోంది. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందా? లేక రామాయణంలో చెప్పినట్టు వానర సైన్యం నిర్మించిందా? ఈ ప్రశ్నకు సైన్స్ ఇస్తున్న సమాధానాలు, పరిశోధనల వివరాలు ఇప్పుడు చూద్దాం.
నాసా ఉపగ్రహ చిత్రాల్లో ఈ కట్టడం స్పష్టంగా కనిపించినప్పటి నుంచి దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. సముద్ర గర్భంలో దాగి ఉన్న ఈ ఇసుక తిన్నెలు, రాళ్ల వరుసపై భారతీయ శాస్త్రవేత్తలతో పాటు అంతర్జాతీయ పరిశోధకులు కూడా అనేక అధ్యయనాలు చేశారు. ఈ పరిశోధనల్లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ ఉన్న రాళ్లు, ఇసుక ఒకే కాలానికి చెందినవి కావని తేలింది.
సైన్స్ ప్రకారం.. రామసేతు ప్రాంతంలో ఉన్న సున్నపురాయి కొండలు, ఇసుక తిన్నెలు ప్రకృతి సహజంగా ఏర్పడే అవకాశం ఉంది. సముద్రపు అలల ఉధృతి, కాలక్రమేణా పేరుకుపోయిన ఇసుక కారణంగా ఇవి ఏర్పడ్డాయని ఒక వర్గం శాస్త్రవేత్తలు వాదిస్తారు. అయితే, అమెరికాకు చెందిన సైన్స్ చానల్ ఒక డాక్యుమెంటరీలో కీలక విషయాలు వెల్లడించింది. ఇక్కడి రాళ్లు వేరే ప్రాంతం నుంచి తెచ్చినట్టుగా ఉన్నాయని, ఇది మానవ నిర్మితం అయి ఉండొచ్చని అందులో పేర్కొన్నారు.
Also Read: చేతులతోనే ఆలోచిస్తుంది.. రూపం మార్చి శత్రువులనే వణికిస్తుంది.. అసలు దీనికి అంత తెలివి ఎలా వచ్చింది?
ఈ నిర్మాణంలో శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురిచేసిన అంశం ఒకటి ఉంది. రామసేతులో ఉన్న ఇసుక తిన్నెల వయసు దాదాపు నాలుగు వేల సంవత్సరాలు అని తేలితే.. వాటిపై ఉన్న రాళ్ల వయసు మాత్రం సుమారు ఏడువేల సంవత్సరాలు అని కార్బన్ డేటింగ్ పరిశోధనల్లో తేలింది. అంటే.. రాళ్లు ఇసుక కంటే ముందే ఎక్కడో తయారయ్యాయి. వేరే ప్రాంతం నుంచి రాళ్లను తీసుకొచ్చి ఇక్కడ అమర్చడం వల్లే ఈ వయసు వ్యత్యాసం వచ్చి ఉంటుందని కొందరి నమ్మకం.
రామాయణ మహాకావ్యంలో నలుడు, నీలుడు అనే వానర శిల్పుల పర్యవేక్షణలో, తేలియాడే రాళ్లతో ఈ సేతువును నిర్మించినట్టు స్పష్టంగా ఉంది. సైన్స్ పరంగా చూస్తే.. సముద్రంలో ప్యుమిస్ (Pumice) అనే ఒక రకమైన అగ్నిపర్వత రాళ్లు ఉంటాయి. ఇవి లోపల బోలుగా ఉండటం వల్ల నీటిపై తేలుతాయి. బహుశా వానర సైన్యం ఇలాంటి రాళ్లనే ఉపయోగించి ఉండవచ్చని, అందుకే రామసేతు కాలపరీక్షకు నిలబడి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని భావిస్తున్నారు.
రామసేతు సహజసిద్ధమైనదా లేక మానవ నిర్మితమా అనేదానికి ఇప్పటికీ వంద శాతం ఖచ్చితమైన శాస్త్రీయ ముగింపు రాలేదు. కొందరు దీనిని ప్రకృతి అద్భుతం అంటుంటే.. మరికొందరు మానవ మేధస్సుకు నిదర్శనం అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, సైన్స్ పరిశోధనలు పురాణాల్లోని విషయాలకు దగ్గరగా వెళ్తుండటం విశేషం. మన దేశ ప్రజలకు ఇది కేవలం ఒక సైన్స్ మిస్టరీ మాత్రమే కాదు.. వారి గుండెల్లో కొలువైన రాముడి ఉనికికి సజీవ నిదర్శనం.
Also Read: మన అరకు ‘మంకీ కాఫీ’కి ఎందుకంత డిమాండ్? కోతులకు సంబంధం ఏమిటీ?