CM Chandrababu: ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు నాయుడు భారీ శుభవార్త చెప్పారు. ఆటో డ్రైవర్ల కోసం సీఎం వాహన మిత్ర పథకం ప్రకటించారు. దసరా రోజు వాహనమిత్ర పథకం అమలు అవ్వనుందని తెలిపారు. దసరా రోజు రూ.15వేలు ఇస్తామని సీఎం చెప్పారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోవత్సవ సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
వైసీపీ నేతలకు అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ముందా అని సీఎం చంద్రబాబు నిలదీశారు. ప్రతిపక్షం హోదా ఇవ్వాల్సింది ప్రజలు.. తాము కాదని చెప్పారు. అసెంబ్లీకి రాకుండా రప్పా రప్పా అంటూ రంకెలు వేస్తున్నారని సీఎం ఫైరయ్యారు. ఇక్కడ ఉన్నది సీబీఎన్, పవన్ కల్యాణ్.. బెదిరింపులకు భయపడమని వ్యాఖ్యానించారు. ‘ఫేక్ రాజకీయాలతో ప్రజలను ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఒంటిమిట్ట, పులివెందులలో ప్రజలు మీ బెండు తీశారు.. ప్రజలు ఏం కోరుకున్నారో అలాంటి పాలననే కూటమిగా అందిస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్ కు సీఎం చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కాలేజీ అంటే ఏంటో తెలియని నాయకుడు వాటి గురించి మాట్లాడుతున్నారని జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ‘భూమిని ఇవ్వగానే అది మెడికల్ కాలేజీ అయిపోదు.. 17మెడికల్ కాలేజీలు ఉంటే.. ఒక్కటి మాత్రమే పూర్తయ్యింది.. గత పాలకులు మెడికల్ కాలేజీలకు పునాదులు వేసి వదిలేశారు.. కూటిమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోంది. మీరేం కోరుకున్నారో అలాంటి పాలననే కూటమిగా అందిస్తున్నాం.. కూటమి ప్రభుత్వ సారథ్యంలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ట పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఇబ్బంది రాకుండా చూస్తున్నాం.. కూటమి ప్రభుత్వం త్రికరణ శుద్ధితో పని చేస్తోంది’ అని సీఎం తెలిపారు.
‘సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యేందుకు అండగా నిలిచిన అన్నదాతకు, స్త్రీశక్తులకు, యువకిషోరాలకు వందనం. ఈ సభ రాజకీయాల కోసం, ఎన్నికల కోసం ఓట్ల కోసం కాదు. 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికే ఈ సభ. సూపర్ సిక్స్ పథకాలను- సూపర్ హిట్ చేశారని చెప్పడానికే ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నాం. నేపాల్ దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ మన తెలుగువాళ్లు 200 మంది చిక్కుకు పోయారు. వారిని స్వస్థలాలకు తిరిగి తీసుకురావడానికి మంత్రి లోకేష్ కి బాధ్యతలు అప్పగించాం. ఆయన రియల్ టైమ్ గవర్నెన్సులో ప్రతీ క్షణం సమీక్షిస్తూ చిక్కుకు పోయిన వారిని వెనక్కు రప్పించే ప్రయత్నంలో ఉన్నారు’ అని అన్నారు.
సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు. బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం. 57 శాతం మంది ప్రజలు ఓట్లేశారు. 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. 164 సీట్లు కూటమికి ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా చేశారు. గత పాలకులు ప్రజా వేదికను కూల్చి వేతతో విధ్వంసం మొదలు పెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టింది. అవినీతి అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. పెట్టుబడుల్ని తరిమేసి పరిశ్రమలు రాకుండా చేశారు. 93 పథకాలను నిలిపేశారు. పేద, మధ్యతరగతి జీవితాలను మార్చేందుకు సూపర్ సిక్స్ గా హామీ ఇచ్చాం. అధికారంలోకి రాగానే ఈ పథకాలను సూపర్ హిట్ చేశాం. సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారు పెన్షన్ల సూపర్ సిక్స్ పై నాడు వాళ్లు ఏమన్నారో గుర్తుందా.? సూపర్ సిక్స్ అంటే హేళన చేశారు. పింఛన్ల పెంపు అంటే అసాధ్యం అన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారు. మెగా డీఎస్సీ అవ్వదన్నారు… దీపం వెలగదన్నారు… ఫ్రీ బస్సు కదలదన్నారు. కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది’ అని చెప్పారు.
రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. మనకు అన్నంపెట్టేది అన్నదాత. రైతన్నకు అండగా ఉండేందుకే అన్నదాత సుఖీభవ పథకం తెచ్చాం. కేంద్రంతో కలిసి ఏడాదికి 3 విడతల్లో రూ. 20 వేలు ఇస్తామన్నాం. తొలి విడతగా ఇప్పటికే రూ. 7 వేలు ఇచ్చాం. 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు జమ చేశాం. నీళ్లిచ్చాం… మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం… మార్కెట్ గిట్టుబాటు ధర వచ్చేలా చేశాం. ఏ రైతుకూ యూరియా కొరత రాకుండా నేను చూసుకుంటాను. ఎంత యూరియా కావాలో అంతే వాడండి. కేంద్రాన్ని అడిగిన వెంటనే యూరియా ఇచ్చారు. ఆర్ధిక కష్టాలున్నా…అండగా నిలిచాం కాబట్టే ‘అన్నదాత సుఖీభవ’ సూపర్ హిట్. ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం. నేడు మళ్లీ దీపం-2 పథకం ద్వారా ఉచితంగా ఏటా 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఇప్పటికే రూ.1704 కోట్లు ఖర్చు చేసి… 2.45 కోట్ల ఉచిత సిలిండర్లు మహిళలకు ఇచ్చాం. ప్రతీ ఇంటా వెలుగులు నింపాం కాబట్టే… ‘దీపం 2’ సూపర్ హిట్’ అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.