ONGC Gas Leak: భూమిని చీల్చుకుంటూ ఉవ్వెత్తున ఎగిసిన గ్యాస్.. ఆ తర్వాత నిప్పుల కొలిమిని మించేలా మంటలు.. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఇప్పుడు బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మంటలు ఆగడం లేదు.. అసలు ఎప్పుడు ఆగుతాయో తెలియని పరిస్థితి.. ఇంతకీ ఇరుసుమండలో ఇంత విధ్వంసం ఎందుకు జరిగింది? గ్యాస్ వెల్ను అంత అజాగ్రత్తగా ఎలా ఓపెన్ చేశారు? అసలు ఈ మంటల పాపం ఎవరిది?
కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామం.. సమయం మధ్యాహ్నం.. ఆ ప్రాంతంలో మోరీ-5 అనే ఆయిల్ బావి ఉంది ONGCకి. అయితే ఆ బావిలో మరమ్మతు పనులు ప్రారంభించారు. అందులో భాగంగా డ్రిల్లింగ్ మొదలుపెట్టారు. భూమిలో2 వేల500 మీటర్ల లోతున డ్రిల్లింగ్ చేస్తుండగా అన్ఎక్స్పెక్డెడ్గా భారీ ఒత్తిడితో గ్యాస్ రిలీజ్ అయ్యింది. దాని ప్రెజర్ ఎంతలా ఉందంటే.. ఆ ప్రాంతం మొత్తం సెకన్లలో గ్యాస్ వ్యాపించింది. ఆ తర్వాత అంతే ఫాస్ట్గా మంటలు.. దాని ఫలితమే.. ఈ ఉపద్రవం.
దెబ్బతిన్న పంట పొలాలు..
మంటల తీవ్రత ఎంతలా ఉందంటే… వంద అడుగుల వరకు వెళ్లాయి. మంటల ధాటికి సమీపంలోని సుమారు 100కిపైగా కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయి. పంట పొలాలు కూడా దెబ్బతిన్నాయి. మంటల తీవ్రత చూసి ఇరుసుమండ ప్రజలు భయంతో ఇళ్లను వదిలి పరుగులు తీశారు… అధికారులు ముందుజాగ్రత్తగా సుమారు 300 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అనవసరంగా బయట తిరగొద్దంటూ హెచ్చరికలు
సింపుల్గా చెప్పాలంటే ఇది బ్లో అవుట్. ఇలాంటి బ్లో అవుట్లను కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. అత్యంత ఒత్తిడితో గ్యాస్ తన్నుకుంటూ వస్తుంది కాబట్టి.. దాని దరిదాపుల్లోకి వెళ్లే పరిస్థితి కూడా ఉండదు. ఇరుసుమండలో కూడా ONGC టీమ్, క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్స్ చేరుకున్నా వారు మంటలు వ్యాపించకుండా చూసుకోవడమే తప్ప.. ఇప్పటికిప్పుడు చేసేదేం లేదనే చెప్పాలి. ఈ మంటలు అదుపు కావాలంటే 24 గంటలు పడుతుందని అఫిషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు అధికారులు. ఘటనాస్థలానికి చుట్టూ కిలోమీటర్ వరకు ప్రభావం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే గ్యాస్ లీక్ కాకుండా అదుపుచేసేందుకు కనీసం 24 గంటలు పడుతుందని ONGC సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అనవసరంగా ప్రజలెవరూ బయట తిరగొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.
గ్యాస్ నిల్వలు అయిపోతేనే మంటలకు బ్రేక్
అయితే ఈ మంటలను ఆపేందుకు రెండే మార్గాలున్నాయని అధికారులు చెప్తున్నారు. ఘటనాస్థలంలో ఓపెన్ చేసిన ONGC రిగ్గు వద్ద గ్యాస్ నిల్వలు అయిపోతేనే మంటలు ఆగుతాయంటున్నారు. లేకపోతే మంటల వ్యాప్తి తగ్గితే గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.
ONGC కూడా దీనిపై అఫిషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తమ అత్యున్నత స్థాయి బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని.. ఇప్పటికే క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్స్ క్షేత్రస్థాయిలో ఉన్నాయని, నరసాపురం బేస్ నుంచి అవసరమైన భారీ యంత్రాలను, అదనపు పరికరాలను ఇరుసుమండకు తరలించామంటూ చెప్పింది. అంతేకాదు సాంకేతిక సమస్యలను పరిష్కరించే క్రమంలో అంతర్జాతీయ నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నట్లు ఓఎన్జీసీ తెలిపింది. ఒకవేళ లీకేజీ కంట్రోల్ కాకపోతే ఆ బావిని శాశ్వతంగా మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నామంది ఓఎన్జీసీ.
క్యాపింగ్ కోసం ప్రయత్నిస్తున్న ONGC
ఈ మంటలను అదుపు చేసేందుకు క్యాపింగ్ అనే టెక్నిక్పై ONGC ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం మంటల నుంచి వెలువడే సెగ.. బావి దగ్గరకు సిబ్బందిని వెళ్లనివ్వడం లేదు. అందుకే నీటిని చిమ్ముతున్నారు. భారీ క్రేన్లు అయితే స్పాట్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు గ్యాస్తో పాటు వచ్చిన ఆయిల్.. చుట్టుపక్కల ఉన్న పొలాలపై చిమ్మిందనే చెప్పాలి. ఈ ప్రమాదంలో ఏదైనా మంచి న్యూస్ ఉందంటే అది ఎవరూ గాయపడకపోవడమే. గ్యాస్ వెల్కు హాఫ్ కిలోమీటరు దూరంలోపు ఎలాంటి ఇళ్లు లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పిందనే చెప్పాలి.
ONGC రిగ్గులు, గ్యాస్పైప్ లైన్లు కోనసీమ ప్రజలకు డేంజర్గా మారాయా? గ్యాస్లీక్ జరిగిన ప్రతిసారీ ప్రాణాలు పోవడమో.. తీవ్ర అస్వస్థతకు గురవ్వడమో తప్పదా? ఎందుకీ ప్రశ్నలు అంటే.. గ్యాస్ లీక్ కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు ఆ ప్రాంత ప్రజలు. ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రతిసారి కాస్త హడావుడి చేయడం.. ఆ తర్వాత మర్చిపోవడం కామన్గా జరుగుతుందనేది వారి ఆరోపణ. మరి ఈ సమస్యలకు ఫుల్స్టాప్ పెట్టడం ఎలా?
అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ONGC కనీస రక్షణ చర్యలు ఎందుకు చేపట్టలేదు? ఇవే ప్రశ్నలు వేస్తున్నారు స్థానిక ప్రజలు. ఇదంతా చూస్తుంటే పాశర్లపూడి ప్రమాదం గుర్తుకు వస్తుంది.. అదే సీన్ రీపిట్ అయితే మా పరిస్థితి ఏంటనేది అక్కడి ప్రజల ప్రశ్న. నిజానికి కోనసీమలో ONGC గ్యాస్ లీక్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఇలా బావుల్లోనో లేదా పైప్ల వద్ద లీకేజీ కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని.. ఇకపై మరోసారి ఇలా జరగకుండా ముందస్తు చర్యలు చేపడతామని ONGC చెబుతూ వస్తున్నా.. ఇలాంటి ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.
ఆకాశాన్ని తాకేలా ఎగిసిన మంట
నిజానికి గ్యాస్ లీక్ అనగానే అందరికి పాశర్లపూడి ఘటనే గుర్తుకు వస్తుంది. 1995 జనవరి 8న జరిగింది ఈ ప్రమాదం. ప్రజలంతా ఉదయాన్నే నిద్రలేచి ఎవరి పనుల్లో వారున్న సమయంలో.. ఒక్కసారిగా ఓ పేలుడు సౌండ్ను విన్నారంతా. ఏంటా అని చూసేలోపే.. ఆకాశాన్ని తాకేలా ఎగిసింది ఓ మంట. ఆ టైమ్లో ONGC చమురు కోసం డ్రిల్లింగ్ చేస్తూ ఉంది. ఆ టైమ్లో జరిగిన పొరపాటు వల్ల గ్యాస్ లీక్ అవ్వడం.. మంటలు అంటుకోవడం క్షణాల్లో జరిగిపోయింది. అప్పుడు కూడా ఆ మంటల తాకిడికి సమీపంలోని కొబ్బరిచెట్లన్నీ క్షణాల్లోనే మాడి మసైపోయాయి. బ్లో అవుట్ నుంచి వచ్చే వేడి వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెట్లన్నీ క్రమంగా చనిపోయి మోడులుగా మారిపోయాయి.
65 రోజుల తర్వాత కంట్రోల్లోకి వచ్చిన మంటలు
పాశర్లపూడిలో వచ్చిన బ్లో అవుట్ను కంట్రోల్ చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. విదేశాల నుంచి కూడా నిపుణులు వచ్చి ప్రయత్నించారు. ఎట్టకేలకు 65 రోజుల తర్వాత ఆ మంటలను కంట్రోల్ చేశారు. ఆ టైమ్లో మంటలను ఆపేందుకు 65 రోజుల సమయం పట్టింది. అంటే జనవరి 8న మంటలు రాజుకుంటే.. మార్చి 15న అదుపులోకి వచ్చాయి. ఆ రెండు నెలల పాటు పాశర్లపూడి పేరు నేషన్వైడ్గా మారుమోగింది. 1995కి ముందు, తర్వాత కోనసీమలో చిన్నచితకా బ్లో అవుట్లు వచ్చినా.. పాశర్లపూడి బ్లో అవుట్ మాత్రం మరవలేని ఓ చేదు జ్ఞాపకం.
ప్రస్తుతం ఇరుసుమండ బ్లో అవుట్ కూడా ఇలాంటి సీన్స్ రీపిట్ చేసే అవకాశం లేకపోలేదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. దానికి తగ్గట్టుగానే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోనడంలో మరింత అవగాహన పెరిగింది. మరి ఈ సారి కూడా బ్లో అవుట్ను కంట్రోల్ చేసేందుకు ఎంత టైమ్ తీసుకుంటారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.
పాశర్లపూడి ఘటన తర్వాత ONGC కీలక నిర్ణయాలు
కానీ పాశర్లపూడి ఘటన తర్వాత ONGC చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదట బ్లోఅవుట్ ప్రివెంటర్ని డెవలప్ చేసింది. ఇది బావి ముఖద్వారం వద్ద ఉండే ఒక భారీ వాల్వ్ అని చెప్పవచ్చు. అదే సమయంలో భూగర్భంలో ఒత్తిడి ఒక్కసారిగా పెరిగినప్పుడు సెన్సార్లు వెంటనే గుర్తించి ఆటోమెటిక్గా సీల్ వేసే విధానాన్ని తీసుకొచ్చింది. ఒకవేళ ఆటోమేటిక్ సిస్టమ్ ఫెయిల్ అయినా, దూరంగా ఉండి రిమోట్ ద్వారా లేదా మ్యాన్యువల్ గా బావిని సీల్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ను ఏర్పాటు చేసుకుంది. వీరికి అమెరికా, నార్వే వంటి దేశాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు. ప్రస్తుతం ఇదే టీమ్ ఇరుసుమండలో వర్క్ చేస్తుంది.
Also Read: నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఇద్దరి పిల్లల్ని చంపి సూసైడ్కు పాల్పడ్డ తండ్రి
నిజానికి ఇప్పుడున్న టెక్నాలజీ సహాయంతో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అనేక రక్షణ చర్యలు ఉన్నాయనేది మనకు అర్థమవుతోంది. డ్రిల్లింగ్ సమయంలో గ్యాస్ ప్రెజర్ పెరిగినప్పుడు బ్లోఅవుట్ ప్రివెంటర్ అనే మెషినరీ బావిని ఆటోమేటిక్గా సీల్ చేయాలి. కానీ ఇరుసుమండలో అది ఎందుకు పని చేయలేదు? అనేది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. అసలు ఈ ప్రమాదం మానవ తప్పిదమా? సాంకేతిక తప్పిదమా? అనేది తేలాల్సి ఉంది. అదే సమయంలో ONGC చెప్పినట్టు 24 గంటల్లో మంటలు కంట్రోల్లోకి వస్తాయా? లేదా? అనేది కూడా చూడాలి.
Story By Vamshi Krishna, Bigtv