Crime News: నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి, పరిస్థితుల కారణంగా మనస్తాపానికి గురై వారిని ప్రాణాలీ తీయడమే కాకుండా, తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికులను కలచివేసింది. శివరాం అనే వ్యక్తి తన ఇద్దరు చిన్నారులను కోయిల్ సాగర్ కాలువలోకి తోసేసి చంపేశాడు. అయితే భార్య రెండేళ్ల క్రితమే విడిచి వెళ్లిపోవడంతో, ఇద్దరు పిల్లల పెంపకం అతనికి భారంగా మారింది. దీంతో ఒంటరి తండ్రిగా పిల్లల పోషణ కోసం నిత్యం పోరాడేవాడు.
అయితే గత నాలుగు రోజులుగా పెద్ద కూతురు రిత్విక అనారోగ్యంతో బాధపడుతుండటంతో, ఆమెను ఆస్పత్రుల చుట్టూ తిప్పిన శివరాం మనోవేదనకు గురయ్యాడు. ఆర్థిక స్తోమత లేకపోవడం, తోడుగా ఎవరూ లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో మద్యానికి బానిసయ్యాడు. తాగి ఉన్న మైకంలో ఏం చేస్తున్నాడో తెలియక, కన్న పిల్లలను కాలువలో పడేసి హతమార్చాడు. అనంతరం తనూ తనువు చాలించాలని పురుగుల మందు తాగి, అది పని చేయకపోవడంతో విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. చివరగా గొంతు కోసుకుని ప్రాణత్యాగానికి ప్రయత్నించాడు.
Also Read: కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి కన్నుమూత
ప్రస్తుతం శివరాం పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్నగర్ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అభం శుభం తెలియని చిన్నారులు తండ్రి చేతిలోనే బలవ్వడంతో తీలేరు గ్రామస్తులను కన్నీరు మున్నీరు చేస్తోంది. ఒక చిన్న కుటుంబం ఇలా చిన్నాభిన్నం కావడం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నింపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ఘటన వెనుక ఉన్న పూర్తి కారణాలపై లోతైన దర్యాప్తు చేపడుతున్నారు.