Cold Weather: తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఎముకలు కొరికేలా చలి తీవ్రత మారింది. సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. తెలంగాణలో 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి గాలులు, పొగమంచుతో రహదారులు కమ్ముకుంటున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా కోహిర్లో నిన్న అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు 7.8 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అదే విధంగా ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో 8.3, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 8.7, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా 7.8 నుంచి 13.9 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. నవంబర్ నెలలో 2016లో మోమిన్పేటలో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. మళ్లీ ఇప్పుడు కోహిర్లో నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందన్నారు. ఉపరితల గాలులు ఈశాన్య దిశ నుంచి గంటకు 4-6 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: మోడీ మానియా.. బీహార్లో NDA ప్రభంజనం
ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. అల్లూరి జిల్లాలోని ప్రాంతాలు ముఖ్యంగా అరకు లోయలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. జీ. మాడుగులలో ఆరు డిగ్రీలు, అరకులో 7.3 డిగ్రీలు రికార్డయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పదికి పైగా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పదిహేను డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణ, ఉత్తర భారతం నుంచి వీస్తున్న పొడి చలిగాలుల కారణంగా రాష్ట్రంలో చలితీవ్రత పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ పెరుగుతున్న చలి
రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
అల్లూరి జిల్లా జి.మాడుగులలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణ-సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.8 డిగ్రీలు నమోదు pic.twitter.com/VHvwsJOxpy
— BIG TV Breaking News (@bigtvtelugu) November 15, 2025