తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జి.ఎర్రంపాలెం ప్రాంతం నుండి బయలుదేరిన ఈ పులి, తాజాగా కూర్మాపురం గ్రామానికి చేరుకుంది. అక్కడ ఒక పాడుబడ్డ ఇంట్లోకి దూరిన పులి, రాత్రంతా అక్కడే సేదతీరినట్లు స్థానికులు గుర్తించారు. ఉదయాన్నే విషయం తెలుసుకున్న గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. అయితే, పులి గ్రామంలోనే ఉందని తెలియడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో జనం అక్కడికి పోటెత్తారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు, సిబ్బంది కూర్మాపురం చేరుకున్నారు. పులి ఉన్న పాడుబడ్డ ఇంటిని చుట్టుముట్టారు. పులిని సురక్షితంగా బంధించేందుకు అవసరమైన బోన్లను కూడా అక్కడికి తరలించారు. ప్రస్తుతం పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక గన్ల ద్వారా మత్తుమందును ప్రయోగించేందుకు నిపుణులు సిద్ధంగా ఉన్నారు.
పులిని బంధించే ప్రక్రియలో అధికారులకు అతిపెద్ద సవాలుగా మారింది. పులిని చూసేందుకు వేలాది మంది ప్రజలు ఎగబడటంతో అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంతమంది జనం ఉంటే తాము ఆపరేషన్ నిర్వహించలేమని, పులి భయపడి జనంపైకి దాడి చేసే ప్రమాదం ఉంది’ అని అధికారులు హెచ్చరిస్తున్నారు. జనాలను వెంటనే అక్కడి నుండి పంపించివేయాలని, లేదంటే ఆపరేషన్ కష్టమవుతుందని పోలీసులను వారు కోరారు.
మరోవైపు స్థానిక ప్రజలు అటవీశాఖ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రాత్రంతా పులి ఒకే చోట సేదతీరుతున్న సమయంలో ఎందుకు బంధించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పులి జనావాసాల మధ్యకు వచ్చిందని, ప్రాణహాని జరిగితే ఎవరిది బాధ్యత అని గ్రామస్థులు నిలదీస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. పులిని బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించే వరకు ఈ ఉత్కంఠ కొనసాగేలా కనిపిస్తోంది.