YS Jagan Mohan Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటనలో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో, ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఒక పార్టీ కార్యకర్త అకస్మాత్తుగా మరణించడంతో ఈ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మృతుడిని కృష్ణా జిల్లా చిల్లకల్లు గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త రాంబాబు (45) గా గుర్తించారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసం వద్ద జగన్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో రాంబాబు పల్స్ పడిపోయి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
జగన్ ఈ పర్యటనను ప్రధానంగా మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబానికి నైతిక మద్దతు ఇచ్చేందుకు చేపట్టారు. జోగి రమేశ్ నివాసంపై ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరారు. అయితే, కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం చేరుకోవడానికి జగన్ కాన్వాయ్కు సుమారు 5 గంటల సుదీర్ఘ సమయం పట్టింది. మార్గమధ్యంలో భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ప్రతిచోటా జగన్ కాన్వాయ్ను ఆపి స్వాగతం పలికారు. ఈ రద్దీ, భారీ జనసందోహం కారణంగా పర్యటనలో తీవ్ర జాప్యం జరిగింది.
Read Also: Jagan Tour: జగన్ని డ్యామేజ్ చేస్తున్న కేడర్.. ఈసారి కొత్తగా ఆ రెండు, టూర్ల వెనుక అసలు కథ ఇదేనా?