Best Sarpanch Award: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేసిన కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ, ఏపీ నుంచి తొమ్మిది పంచాయతీలను విజేతలుగా ప్రకటించింది. ఈ క్రమంలో ఏలూరు జిల్లా, నూజివీడు మండలం, రావిచెర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు జాతీయ స్థాయిలో ‘ఉత్తమ సర్పంచ్’ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ భగేల్ చేతులమీదుగా శ్రీనివాసరావు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ వేడుకలకు కాపా శ్రీనివాసరావును కుటుంబ సమేతంగా ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం విశేషం. కర్తవ్య పథ్లో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ను ఆయన తన కుటుంబంతో కలిసి వీక్షించారు. ఒక సామాన్య గ్రామ ప్రజాప్రతినిధికి దేశ రాజధానిలో ఇంతటి గౌరవం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అవార్డు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉత్తమ సర్పంచ్గా ఎంపికవ్వడం తన జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకమని, తన గ్రామాభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ పురస్కారం అంకితమని భావోద్వేగానికి లోనయ్యారు.
ముఖ్యంగా ఈ విజయంలో తనకు అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తన గ్రామ పంచాయతీ ప్రజల సహకారం వల్లే ఈ గుర్తింపు లభించిందని ఆయన కొనియాడారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి, రావిచెర్ల గ్రామ పంచాయతీని దేశంలోనే నంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా ప్రతినబూనారు.
Read Also: Markapuram: స్కూల్ ఆవరణలో శవం పాతిపెట్టిన వైసీపీ నేత.. స్థలం తనదేనంటూ వాదన