Guntur Crime: బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్తను హత్య చేసింది భార్య. ఈ ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో కలకలం రేపుతోంది. ఈ కేసులో నిందితులు గోపీ, లక్ష్మీ మాధురి, సురేశ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతడికి లక్ష్మీమాధురి అనే మహిళతో 2007లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. భార్య లక్ష్మీ మాధురి విజయవాడలోని సినిమా హాల్లో టికెట్ కౌంటర్లో పనిచేస్తుంది. ఆ సమయంలో ఆమెకు సత్తెనపల్లికి చెందిన గోపితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. గోపి హైదరాబాద్ లో ట్రావెన్స్ నిర్వహిస్తుండడంతో.. అతడి వద్దకు భర్తను ఉద్యోగానికి పంపింది. కొంతకాలం తర్వాత నాగరాజు హైదరాబాద్ నుంచి చిలువూరుకు తిరిగి వచ్చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. నాగరాజు ఇంటి వద్ద నుంచే వ్యాపారం చేస్తుండడంతో..గోపిని కలవడానికి అడ్డుగా మారాడు. దీంతో అతడిని అడ్డు తప్పించుకోవాలని లక్ష్మీమాధురి ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది.
ఆర్ఎంపీ సురేశ్ వద్ద గోపి నిద్రమాత్రలు తీసుకుని లక్ష్మీమాధురికి ఇచ్చాడు. ఈ నిద్ర మాత్రలను లక్ష్మీ బిర్యానీలో కలిపి భర్తకు పెట్టింది. ఆ బిర్యానీ తిన్న తర్వాత నిద్రమత్తులో ఉన్న భర్త గుండెపై అప్పడాల కర్రతో బలంగా కొట్టి చంపారు. ఈ నెల 18న శివనాగరాజు మృతి చెందాడు. అయితే అతడి మృతి అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్ట్ మార్టం రిపోర్టులో ఛాతీపై ఎముకలు విరిగినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పోలీసులు తమ స్టైల్ విచారణ చేయగా.. లక్ష్మీ మాధురి అసలు విషయం బయటపెట్టింది. దీంతో నిందితులు లక్ష్మీ మాధురి, గోపి, నిద్ర మాత్రలు ఇచ్చిన ఆర్ఎంపీ సురేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: పండుగ పూట తీరని లోటు.. బాన్సువాడ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి