Jewelry Robbery: సికింద్రాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే మోండా మార్కెట్లో జరిగిన భారీ చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జర్గీష్ జ్యువెలరీ షాపు తయారీ కేంద్రం లక్ష్యంగా జరిగిన ఈ దొంగతనంలో సుమారు 16.5 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీని విలువ మార్కెట్లో సుమారు రూ. 25 లక్షల వరకు ఉంటుందని అంచనా. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
జర్గీష్ జ్యువెలరీ షాపు యజమాని శనివారం ఉదయం ఎప్పటిలాగే తన దుకాణాన్ని తెరిచేందుకు వచ్చారు. అయితే.. షాపు షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి ఆయన షాక్కు గురయ్యారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా, కస్టమర్ల ఆర్డర్ల కోసం సిద్ధం చేసి ఉంచిన భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు కనిపించలేదు. దుకాణదారుడు వెంటనే మోండా మార్కెట్ పోలీసులకు సమాచారం అందించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. షాపులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఒక గుర్తు తెలియని యువకుడు ఒక బ్యాగుతో అనుమానాస్పదంగా బయటకు వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. తాళాలు పగలగొట్టిన విధానం, నగలు ఎక్కడ ఉన్నాయో కచ్చితంగా తెలిసి దొంగతనం చేసిన తీరును బట్టి, ఇది తెలిసిన వారి పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ఈ చోరీలో షాపులో పనిచేసే పాత లేదా ప్రస్తుత సిబ్బంది హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దుకాణం లోపల భద్రత.. నగలు ఉంచే చోటుపై అవగాహన ఉన్నవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చనే కోణంలో విచారణ సాగుతోంది. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: వాహనదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ‘బంపర్ ఆఫర్’.. ఇకపై పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఈజీ!