AP Telangana Water Dispute: ఆంధ్రప్రదేశ్ నిర్మించతలపెట్టిన గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల తీవ్ర వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. పోలవరం కుడి కాలువ ద్వారా నల్లమల సాగర్, బనకచర్ల రిజర్వాయర్ కు నీటిని తరలించాలన్న ఏపీ నిర్ణయాన్ని తెలంగాణ తప్పుబడుతోంది. తమ నీటి హక్కులకు భంగం కలుగుతుందని తెలంగాణ ఆరోపిస్తుంటే.. సముద్రంలో కలిసే నీటినే తాము వినియోగించుకుంటామని ఏపీ చెబుతోంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును సైతం తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే.. ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu).. దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అయ్యారు. దీంతో తెలంగాణ నేతలు ఒక్కసారిగా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. చంద్రబాబు భేటిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో భేటి సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక అంశాలను ప్రస్తావించారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయం పెండింగ్లో ఉన్న అంశాలతో పాటు, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైనా సవివరంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని జలశక్తి మంత్రిని ఆయన కోరారు. ఈ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టు అమలులో అవరోధాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్మెంట్ చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్- IIకి ఆర్థిక సహాయం అందించాలని ఫేజ్- IIలో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉందని జలశక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీటికి అదనంగా రూ.32,000 కోట్ల నిధులు అవసరం అవుతాయని పేర్కొన్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్తో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు భేటీ అయ్యారు. వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం, అంతర్రాష్ట్ర వివాదాలు, పెండింగ్లో ఉన్న అంశాలతో పాటు, పరిష్కారంపైనా సవివరంగా చర్చించారు.… pic.twitter.com/9WP4ljhEqw
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 10, 2026
గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం – నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును నిర్మించతలపెట్టినట్లు సీఆర్. పాటిల్ తో చంద్రబాబు అన్నారు. తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాలు తీర్చే కీలక ప్రాజెక్టుగా అభివర్ణించారు. జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి, సాంకేతిక – ఆర్థిక సాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలని.. ట్రిబ్యునల్ నివేదికను వెంటనే గెజిట్ లో ప్రచురించి ఆ నదిపై నిర్మించ తలపెట్టిన నేరడి బ్యారెజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలన్నారు.
గోదావరి జలాల పంపకాలపై ఏపీ, తెలంగాణ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని కూడా కేంద్ర జలశక్తి మంత్రి వద్ద చంద్రబాబు ప్రస్తావించారు. నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ను తక్షణమే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ఈ సందర్భంగా చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్కు వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని సీఆర్ పాటిల్ కు తెలియజేశారు. మెుత్తం మీద ఆంధ్రప్రదేశ్ లోని పెండింగ్ ప్రాజెక్టులు, తెలంగాణ సహా ఒడిశా, మహారాష్ట్రలతో ఉన్న జల వివాదాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సత్వరం పరిష్కారించాలని చంద్రబాబు కోరారు.
Also Read: Cm revanth : తెలంగాణకు పాకిన కల్తీ నెయ్యి అంశం.. ఇచ్చి పడేసిన సీఎం!
జలశక్తి మంత్రితో చంద్రబాబు భేటి సందర్భంగా వచ్చిన అంశాల గురించి తెలంగాణ రాజకీయ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నల్లమల సాగర్ ప్రాజెక్టు గురించి చంద్రబాబు చేసిన ప్రతిపాదనలు.. దానికి సీ.ఆర్ పాటిల్ నుంచి వచ్చిన సమాధానాల గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా భవిష్యత్తులో జల వివాదం అంశంపై ఏ విధంగా ముందుకు సాగాలి? ఏపీ ప్రభుత్వ చర్యలను ఎలా అడ్డుకోవాలి? అన్న దానిపై తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీలు కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: YS Jagan: అసెంబ్లీకి జగన్.. తిరుమల కల్తీ నెయ్యిపై స్పందిస్తారా? సంతకం చేసి వెళ్తారా?