Home Minister Anitha: రప్పా రప్పా అంటూ మైనర్ల చేత ఫ్లెక్సీలు పెట్టించి.. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని హోం మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, చిన్న పిల్లలను నేర ప్రవృత్తి వైపు నెట్టే విధంగా రాజకీయాలు చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో మాట్లాడిన హోం మంత్రి అనిత, ప్రతిపక్ష నేతలపై నిప్పులు చెరిగారు. మైనర్లను రాజకీయ ఆయుధాలుగా మార్చడం అత్యంత ప్రమాదకర ధోరణి అని హెచ్చరించారు. చిన్నపిల్లలను ప్రేరేపించి నేరాలతో ముందుకు తీసుకెళ్లే పరిస్థితులను సృష్టిస్తున్నారు. ఈ పరిస్థితులకు కారణమైన విధానాల వెనుక జగన్ రెడ్డి ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడే రాజకీయాలను ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఆమె స్పష్టం చేశారు.
జగన్ విధానాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని హోం మంత్రి అన్నారు. గత ఎన్నికల్లోనే ప్రజలు సరైన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో తుది తీర్పు ప్రజలదేనని, అదే తీర్పు రాబోయే ఎన్నికల్లో కూడా మరింత స్పష్టంగా వెలువడుతుందని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరు ఏం చేస్తున్నారో వారికి బాగా తెలుసు అని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయి హబ్గా మారిందని అనిత తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమంగా గంజాయి తరలింపు, మత్తు పదార్థాల వ్యాపారం విపరీతంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గంజాయి తరలించే నిందితులను పట్టుకొని, వారిపై NDPS యాక్ట్ కింద కఠిన కేసులు నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు.
రౌడీ మూకల ఆటలకు త్వరలోనే కట్టడి ఉంటుందని హోం మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, నేరాలకు పాల్పడే వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రౌడీ మూకల ఆటలను అరికడతాం. చట్టం చేతిలోకి తీసుకునే వారిని ఉపేక్షించం అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం పోలీసులు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారని అనిత చెప్పారు. మైనర్లను నేరాల వైపు నెట్టే వారిని గుర్తించి కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం పిల్లలను ముందుకు తెచ్చే ధోరణి సమాజానికి ప్రమాదకరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
ప్రతిపక్ష పార్టీ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హోం మంత్రి, ప్రజల్లో భయాన్ని సృష్టించే రాజకీయాలు కాకుండా బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయాలని సూచించారు. ఫ్లెక్సీలు, నినాదాలతో కాదు.. ప్రజలకు భద్రత, అభివృద్ధి ఇచ్చే విధానాలతోనే రాజకీయాలు చేయాలి అని ఆమె అన్నారు.
Also Read: LMV-3 ప్రయోగం సక్సెస్ అవ్వాలని.. శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్
రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఎక్కడా.. రాజీ పడబోదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. మత్తు పదార్థాలు, రౌడీ సంస్కృతి, మైనర్లను నేరాల వైపు నెట్టే ప్రయత్నాలన్నింటినీ కఠినంగా ఎదుర్కొంటామని ప్రకటించారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, చట్టం ముందు అందరూ సమానమేనని మరోసారి గుర్తు చేశారు.