India agricultural debt statistics: దేశవ్యాప్తంగా అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా రైతులపై మొత్తం రూ. 31,34,807 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఇందులో పంట సాగు కోసం తీసుకున్న స్వల్పకాలిక రుణాలు రూ. 16,34,219 కోట్లుగా ఉండగా.. వ్యవసాయ అనుబంధ పనులు యంత్రాల కొనుగోలు కోసం తీసుకున్న టర్మ్ లోన్స్ రూ. 15,00,588 కోట్లుగా నమోదయ్యాయి.
వ్యవసాయ రుణాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా భారీగా ఉండటం గమనార్హం. దేశం మొత్తం మీద తమిళనాడు రాష్ట్రం అత్యధికంగా రూ. 5,06,290 కోట్ల రుణాలతో మొదటి స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రూ. 3,75,254 కోట్ల అప్పులతో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర రూ. 3,07,293 కోట్లతో మూడో స్థానంలో నిలవగా.. ఉత్తరప్రదేశ్ కర్ణాటక రాజస్థాన్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం రూ. 1,75,960 కోట్ల రుణ భారంతో దేశంలో ఏడో స్థానంలో ఉంది. గత కొన్ని ఏళ్లుగా పెరుగుతున్న పెట్టుబడి వ్యయం సాగులో వస్తున్న నష్టాలు రైతులను రుణాల వైపు మళ్లిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల రుణాల విశ్లేషణ చూస్తే ఆంధ్రప్రదేశ్ రైతులపై భారం అధికంగా కనిపిస్తోంది. ఏపీలో పంట రుణాలు రూ. 2,01,744 కోట్లుగా ఉండగా.. టర్మ్ లోన్స్ రూ. 1,73,510 కోట్లుగా ఉన్నాయి. మొత్తం రూ. 3,75,254 కోట్ల రుణాలతో ఏపీ రైతులు దేశంలోనే రెండో అత్యధిక రుణగ్రస్తులుగా మిగిలారు. మరోవైపు తెలంగాణలో పంట రుణాలు రూ. 95,167 కోట్లుగా నమోదు కాగా.. టర్మ్ లోన్స్ రూ. 80,792 కోట్లుగా ఉన్నాయి. మొత్తం రూ. 1,75,960 కోట్లతో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ రుణాల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.
కేంద్రం వెల్లడించిన ఈ టాప్ 10 జాబితాలో గుజరాత్ రూ. 1,68,460 కోట్లు కేరళ రూ. 1,61,023 కోట్లు మధ్యప్రదేశ్ రూ. 1,70,757 కోట్ల రుణాలతో నిలిచాయి. ప్రభుత్వాలు ఎన్ని రుణమాఫీ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ బ్యాంకుల నుంచి రైతులు పొందుతున్న రుణాల పరిమాణం ఏటా పెరుగుతూనే ఉంది. ఈ గణాంకాలు అన్నదాతల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిస్తున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పెట్టుబడి సాయం సకాలంలో అందిస్తేనే ఈ రుణ భారం నుంచి వారికి విముక్తి లభిస్తుందని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
Read Also: CM Chandrababu Naidu: కరెంట్ ఛార్జీలు పెంచనని మళ్లీ హామీ ఇస్తున్నా: సీఎం చంద్రబాబు