International Fleet Review – 2026: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో అంతర్జాతీయ నౌకదళ సమీక్ష (International Fleet Review – 2026) ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు.. ఫ్లిట్ రివ్యూలో పాల్గొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతి ప్రయాణిస్తూ.. యుద్ధ నౌకల విన్యాసాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.
అంతకుముందు విశాఖ పట్నం తీరంలో నౌకాదళ అధికారులు అందించిన గౌరవ వందనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వీకరించారు. రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఈ కార్యక్రమంలో పాల్గొని.. విన్యాసాలను వీక్షించారు.
అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షలో దాదాపు భారత్ నుంచి 71 యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు, కోస్ట్ గార్డు నౌకలు పాల్గొన్నాయి. అలాగే 20 దేశాల నుంచి వచ్చిన మరికొన్ని నౌకలు సైతం ఈ రివ్యూలో పాల్గొన్నట్లు నౌకాదళ అధికారులు తెలియజేశారు. కాగా అంతర్జాతీయ నౌకల సమీక్షను చేస్తున్న తొలి మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించడం విశేషం.
భారత నౌకాదళ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఐఎఫ్ఆర్-2026 జరుగుతోంది. భారత మిత్రదేశాలైన అమెరికా, రష్యా, యూఏఈ, ఫిలిప్పీన్స్ నౌకలు ఈ పరేడ్ లో పాలుపంచుకోవడం ఆకట్టుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో కీలకంగా వ్యవహరించిన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ రివ్యూలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.