మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్ష నాయకుడా? ప్రతినాయకుడా? అన్న చర్చ ప్రస్తుతం ఏపీలో జోరందుకుంది. సాధారణంగా రాజకీయాల్లో నాయకులు ఉంటారు. ప్రతినాయకుడు అనేది ఒక పాత్ర.. సినిమాల్లో ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. అందరికీ అర్థం అయ్యే భాషలో చెప్పాలంటే విలన్.. ఎందుకంటే హీరోకు సమానంగా విలన్ రోల్ ఉంటుంది. హీరో మంచి చేస్తే.. విలన్ చెడు చేస్తుంటాడు. ఏదైమైనా జనాలకు విలన్ కంటే హీరోనే ఇష్టం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే మాజీ సీఎం జగన్.. ప్రతిపక్ష పాత్ర పోషించకుండా.. ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడని మంత్రి నారాలోకేశ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
వైసీపీ అధినేత జగన్ అధికారానికి దూరం అయ్యాక ఏమీ తోచని స్థిలో ఉన్నాడని తెలుస్తున్నది. తన తండ్రి లాగా తాను జనం మెచ్చిన నేత అనిపించుకుని, రెండోసారి ముఖ్యమంత్రి అవుతానని చాలా సార్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.అనుకోకుండా ఆయన్ను ప్రజలు గద్దె దించారు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో కూడా తేల్చుకోలేని స్థితిలో ఆయన ఉన్నారు. దీంతో జగన్ ప్రతిపక్ష నేతగా తన పాత్రను తానింకా ఓన్ చేసుకోలేదని తెలుస్తున్నది. ప్రతిపక్షం అంటే అధికార పక్షానికి పాలనలో సహాయ సహకారాలు అందిస్తూనే ప్రజలకు మంచి జరిగే ప్రభుత్వ నిర్ణయాలు,స్కీమ్స్లో వెన్నంటే ఉండాలి. చెడు జరుగుతుందనుకుంటే వ్యతిరేకించాలి.
సినిమాల్లో విలన్.. హీరో ఏది చేసినా దానికి వ్యతిరేకంగా చేస్తుంటాడు. ప్రతిదానికి అడ్డుపడుతుంటాడు.వెంటాడి వేధిస్తుంటాడు. అష్టకష్టాలు పెడతాడు. ఇప్పుడు జగన్ తీరు అలాగే ఉందని మంత్రి నారాలోకేశ్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. జగన్ ప్రతిపక్ష పాత్ర మరిచి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారని నిన్న విమర్శించారు. ఇలా ఎందుకు అన్నారంటే.. ఇటీవల కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుబట్టడం, వ్యతిరేకించడం వంటి పనులను జగన్, వైసీపీ పార్టీ లీడర్లు చేయడమే. విశాఖలో కంపెనీలకు అతితక్కువ ధరకు భూమి కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన, రాయితీల విషయంలో వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
దీనికి తోడు మెడికల్ కాలేజీల అంశంలోనూ రాజకీయం చేస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి నిర్వహిస్తే అటు పేదమధ్య తరగతి వారికి వైద్య విద్య అందుతుందని ప్రభుత్వం చెబుతోంది.నిర్వహణ వ్యవహారాలు సైతం ప్రభుత్వం అండర్ లోనే ఉంటాయని, ప్రయివేటుకు అప్పగించబోమని సీఎం చంద్రబాబు సైతం క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ జగన్, ఆయన బృందం ఇదో పెద్ద కుంభకోణమని కూటమి సర్కారుపై విమర్శలు గుప్పిస్తోంది. విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు వస్తుండగా.. వాటికి ఇచ్చిన భూములపై ప్రతిపక్ష నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఇలా జగన్ అండ్ టీం చర్యలతో అభివృద్ధిలో ఏపీ మరింత వెనుకబడుతుందే గానీ ముందుకు వెళ్లదని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. ప్రజల కోసం పనిచేసేవాడు నాయకుడు అని.. చెడు చేసే వాడు ప్రతినాయకుడు అవుతాడని మంత్రి నారాలోకేశ్ ఇందుకే అన్నారు కాబోలు.