Ap Politics: వైసీపీలో ఏం జరగబోతోంది? ఎందుకు పార్టీ నేతలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు? నేతలు అధినేతను తప్పుదోవ పట్టించారా? ఎదురు చెప్పలేక అలాంటి సమాచారం ఇచ్చారా? ట్రోల్ అయితేనే గానీ వైసీపీ అసలు పరిస్థితి అర్థం కాలేదా? ఇంతకీ ఈ గొడవ వెనుక ఏం జరిగింది? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి.
పార్టీ నేతలు జగన్ని తప్పుదోవ పట్టించారా?
వైసీపీ ఓటమి తర్వాత బెంగుళూరుకి మకాం మార్చేశారు వైసీపీ అధినేత జగన్. వారానికి ఒకసారి లేకుంటే రెండు వారాలకు బెంగుళూరు నుంచి తాడేపల్లి వస్తున్నారు. అందు బాటులో ఉన్న నేతల నుంచి సమాచారం తీసుకుని మీడియా వచ్చారు.. వస్తున్నారు కూడా. వాటి గురించి మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఒక్కోసారి అడ్డంగా బుక్కయిన సందర్భాలు లేకపోలేదు.
గతవారం మీడియా ముందుకొచ్చారు వైసీపీ అధినేత జగన్. తొలిసారి దాదాపు మూడుగంటల సేపు వివిధ అంశాలపై మాట్లాడారు. ఆ సమావేశం మొత్తంలో ఎక్కువగా హైలైట్ అయ్యింది తిరుమల పరకామణి, లడ్డూలో కల్తీ నెయ్యి ఇష్యూలు. వీటిపై జగన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్ అయ్యాయి.
జగన్ ఆగ్రహం.. డైవర్ట్ చేసేందుకు కొత్త పల్లవి?
ఎందుకిలా జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేశారట. ఈ క్రమంలో కీలక విషయాలు బయటకు వచ్చాయని పార్టీ వర్గాల మాట. పరకామణి చోరీని చిన్న తప్పుగా జగన్ వర్ణించడంపై నెటిజన్స్ ఓ రేంజ్లో ఆటాడేసుకున్నారు. ఉన్నట్లుండి సోషల్ మీడియాలో ట్రోల్ వ్యవహారం అధినేత చెవిలో పడింది.
వీటిపై సమాచారం ఇచ్చిన నేతలపై ఓ రేంజ్లో అధినేత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు టాక్. తప్పుడు సమాచారంతో తనను పక్కదారి పట్టిస్తారా? అసలే దేవుడి సెంటిమెంట్ బలంగా ఈ రోజుల్లో.. ఈ తరహా అంశాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యహరించాలి. ఇవేమీ తెలియకుండా తప్పుడు సమాచారం ఇస్తారని మండిపడినట్టు సమాచారం.
ALSO READ: విశాఖ ఆర్కే బీచ్లో అగ్నిప్రమాదం.. అపార్ట్మెంట్లో మంటలు
దీని నుంచి తేరుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు వైసీపీ అధినేత. బెంగుళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన ఆయన, బుధవారం తాడేపల్లిలో పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. నెటిజన్స్ ట్రోల్ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు, హాస్టళ్లలో విద్యార్థుల మరణాలు వంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారట.
దీనిపై ఇవాళ పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నట్లు తెలుస్తోంది. వీటిపై సమాచారం ఇచ్చేందుకు సెపరేట్గా ఓ టీమ్ని ఏర్పాటు చేసినట్టు తాడేపల్లి పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వ్యవహారాలపై ఆచితూచి వ్యవహరించాల్సి పోయి అడ్డంగా బుక్కయ్యారు మాజీ సీఎం.