Jagan On CM Chandrababu: దాదాపు నెల రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. వివిధ అంశాలపై చంద్రబాబు ప్రభుత్వం ఆయన దుమ్మెత్తిపోశారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు ఎప్పుడైనా భూములను రీసర్వే చేసి రైతుల్ని ఆదుకోవాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. ప్రజలు అనేక రకాల భూ సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం
గురువారం ఉదయం మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష సర్వే గురించి ఆయన మాట్లాడారు. తాము నిజాయితీగా చేశామని చెప్పే ప్రయత్నం చేశారు.
రైతులు లేవనెత్తిన అనేక భూ సమస్యల పరిష్కారానికి రీసర్వే ఒక్కటే మార్గమన్నారు. వివాదాలు లేకుండా పాదర్శకంగా రీసర్వే చేశామన్నారు. యజమానులకు శాశ్వత పత్రాలు ఇచ్చామన్నారు. భూముల రీసర్వేపై చంద్రబాబు సర్కార్ ఎందుకు యూటర్న్ తీసుకుందని ప్రశ్నించారు. దీన్ని అవాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల కేంద్రం రూ. 400 కోట్లు ఇచ్చిందన్నారు.
భూసర్వే ఆపడంపై మండిపాటు.. క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ రుసరుస
నాలుగేళ్ల మా కష్టంపై సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు. రైతుల పాస్ బుక్ లపై తన ఫోటోను ముద్రించుకున్నారు జగన్. చివరకు సర్వే రాళ్లపై తన పేరు నిలిచిపోయేలా చేసుకున్నారు. అందుకోసం అప్పటి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు ఆరోపణలు లేకపోలేదు.
అదే సమయంలో అనుచరులకు వేలాది ఎకరాలు దోచి పెట్టునట్టు విమర్శలను సైతం వైసీపీ ప్రభుత్వం మూటగట్టుకుంది. మా నాన్న వైఎస్ఆర్-చంద్రబాబు సమకాలికులు. ఆయన కొడుకు వయస్సులో ఉన్న తనతో ఆయన పోటీ పడలేకపోతున్నారని, తాను చేసినదానికి ఆయనే క్రెడిట్ తీసుకొంటున్నారని చెప్పుకునే ప్రయత్నం చేశారు.
ALSO READ: లిక్కర్ స్కామ్లో సంచలనం.. ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి.. ఏం జరగబోతోంది?
చంద్రబాబు.. నాయకుడు కాదని, కనీసం పాలకుడు కాదన్నారు మాజీ సీఎం. చెడ్డ అలవాట్లు, చెడ్డ గుణాలు ఉన్న తప్పుడు మనిషిగా వర్ణించారు. దైవ గ్రంధాలు ఏది చదివినా అందులో మోసాలు చేయవద్దని చెబుతారని, కానీ చంద్రబాబు అలా కాదన్నారు. దౌర్జన్యాలు, మోసాలు, అబద్దాలు, వెన్నుపోటు చేసినా తప్పులేదని కొడుక్కి, పార్టీ నేతలు ఆయన చెబుతున్నారని దుయ్యబట్టారు.
వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యపై జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన్ని చంపించే పాత్ర పోషించారని ఆరోపించారు. సిగ్గుతో తలవంచుకోవాల్సిన అంశమన్నారు. ప్రభుత్వం చేస్తున్న వాటిపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామన్నారు. అటు అమరావతి నిర్మాణాలపై తన అక్కసును వెల్లగక్కారు మాజీ సీఎం. స్వేర్ ఫీట్ పది వేల రూపాయలా? అంటూ ప్రశ్నించారు.