Jangaon Road Accident: జనగామ జిల్లా పెంబర్తి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరూ ప్రాణ స్నేహితులు కావడంతో వారి కుటుంబాల్లోనూ.. స్థానికంగానూ తీవ్ర విషాదం నెలకొంది.
జనగామకు చెందిన వట్టి నితిన్ రెడ్డి(28), మహమ్మద్ సీజాహిద్ (25) ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి పని మీద బైక్పై ఆలేరుకు వెళ్లారు. తిరిగి ఆలేరు నుండి జనగామ వైపు వస్తుండగా.. పెంబర్తి గ్రామ శివారులో వెనుక నుండి అతివేగంగా వచ్చిన ఓ కారు వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది. కారు వేగం ఎక్కువగా ఉండటంతో బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ధాటికి ఇద్దరు యువకులకు తీవ్ర గాయలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయ చర్యలు చేపట్టే ప్రయత్నం చేసినప్పటికీ.. తీవ్ర రక్తస్రావం కావడంతో నితిన్ రెడ్డి, సీజాహిద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చెల్లాచెదురుగా పడి ఉన్న బైక్ భాగాలు ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగింతో సూచిస్తున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తున్నారు. కారు డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అందిన కొడుకులు ఇలా అర్థాంతరంగా మృతి చెదడంతో ఆ కుటుంబాల్లో తీరని లోటు ఏర్పడింది.
ALSO READ:చంద్రబాబు ‘మార్కాపురం’ మాస్టర్ ప్లాన్.. జిల్లా ఏర్పాటు వెనుక ఉన్న అసలు లెక్కలివే!