KTR: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖకి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఫైలుపై ఆయన సంతకం చేశారు. కేటీఆర్పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం బీఆర్ఎస్లో కలకలం రేపుతోందంట.
తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్పై విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అనుమతి ఇచ్చారు. దీంతో, ఈ-కారు రేసు కేసులో కేటీఆర్పై ఛార్జ్షీట్ వేసేందుకు ఏసీబీకి గవర్నర్ అనుమతి లభించినట్టు అయ్యింది. అయితే, కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
కాగా, ఫార్ములా ఈ-కారు రేసులో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఏసీబీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. రెండు సార్లు ఏసీబీ విచారణకు, ఒకసారి ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇక, ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై 2024 డిసెంబరు 18న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదైంది.
గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్పై అభియోగాలు నమోదు చేసి, విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి, విచారణ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. తాజా పరిణామంతో త్వరలోనే కేటీఆర్పై అభియోగాలు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోందట. విచారణ తర్వాతే ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. విచారణ అనంతరం ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఏసీబీ భావిస్తోంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై విచారణకు కూడా ఏసీబీ చర్యలు వేగవంతం చేసింది. ఆయనపై అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ..డీవోపీటీకు లేఖ రాసింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే అరవింద్ కుమార్పైనా ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది.
Story By Apparao, Big Tv