Tirumala Cases: తిరుమల కేసుల వ్యవహారంలో వైసీపీ ఇరుక్కుపోయిందా? తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం, పరకామణి కేసుల్లో జగన్ కొత్త విషయాలు బయట పెట్టారా? వైవీ సుబ్బారెడ్డి పల్లవిని ఎత్తుకున్నారా? తిరుమలను రాజకీయాలకు చంద్రబాబు ప్రభుత్వం వాడుకుంటుందా? వైసీపీ సర్కార్ తన తప్పులను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తిరుమల వ్యవహారంపై నోరు విప్పిన జగన్
తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం తీవ్ర దుమారం రేగింది. దీనిపై చంద్రబాబు సర్కార్ సిట్ వేయడంతో నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అప్పటి టీటీడీ పెద్దలు, వైసీపీ నేతలు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ కేసు విచారణ వేగంగా జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేసింది సీబీఐ. దాదాపు 20 కోట్ల లడ్డూలు కల్తీ జరిగాయని సీబీఐ ఛార్జిషీటు ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో ప్రమేయమున్న అప్పటి టీటీడీ పెద్దలను విచారించింది. దీంతో వైసీపీకి చెమటలు పడుతున్నాయి. ఈ మధ్యనే టీటీడీ ఉద్యోగిని అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. రేపో మాపో కొందరికి పిలుపు వస్తుందన్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్.
పరకామణి కేసు చిన్న చోరీ-జగన్
ఓ కేసు విచారణలో ఉండగా అస్సలు ఏ ఒక్కరూ మాట్లాడరు. వాటిని తుంగలో తొక్కారు జగన్ సహా వైసీపీ నేతలు. ఆ కేసు గురించి మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తమ తప్పేమీ లేదని, చంద్రబాబు ప్రభుత్వం నుంచి విచారణ చేయించాలని కొత్త పల్లవిని ఎత్తుకుంది. ఈ విషయాన్ని న్యాయస్థానంలో వైసీపీ నేతలు ఎందుకు చెప్పలేదు? అన్నది ఫస్ట్ ప్రశ్న.
తిరుమలను రాజకీయాలకు వేదికగా చంద్రాబాబు సర్కార్ వాడుకుంటోందని జగన్ ఆరోపించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనడానికి ఆధారాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో తక్కువ ధరకు నెయ్యి కొన్నారని, అదీ కూడా కల్తీనా అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ ఉందని దుష్ప్రచారం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.
ఇక పరకామణి కేసు విషయానికి వద్దాం. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశించలేదు. కేవలం ఓ వ్యక్తి వేసిన పిటిషన్ ఆధారంగా హైకోర్టు.. సీఐడీతో విచారణకు ఆదేశించింది. దీనిపై డిసెంబర్ రెండున న్యాయస్థానానికి నివేదిక సమర్పించడం అంతా జరిగిపోయింది. దీనిపైనా నోరు విప్పారు మాజీ సీఎం జగన్.
ALSO READ: హిడ్మా ఎన్ కౌంటర్ భూటకపు హత్య, మావోయిస్టుల సంచలన లేఖ
ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ జరిగిందని నిజం ఒప్పేసుకున్నారు. తొమ్మిది డాలర్లు అంటే భారత్ కరెన్సీలో దాని విలువ 72 వేలు దొంగతనం జరిగిందని చెప్పకనే చెప్పారు. ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చారని ఆరోపించారు. ఆ కేసులో పోలీసు అధికారి సతీష్ ఎలా మరణించారో ఇప్పటికీ ఎవరికీ తెలీదు.
దానిపై సీఐడీ దర్యాప్తు చేసింది. ఇది చాలా ఆశ్యర్యకరంగా ఉందన్నారు జగన్. ప్రాయశ్చితంగా దొంగతనం చేసిన దొంగ కుటుంబసభ్యులు రూ. 14 కోట్లు విలువైన వారి ఆస్తులు దేవుడికి ఇవ్వడం తప్పు అవుతుందని ప్రశ్నించారు. అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయని, కానీ ఎక్కడైనా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు.
దీనిపై తిరుపతి కోర్టులో ఛార్జిషీటు వేశారని, లోక్ అదాలత్లో పరిష్కరించారని గుర్తు చేశారు. జ్యూడీషియల్ ప్రొసీజర్స్ అంతా జరిగిందన్నారు. సాంకేతిక పరమైన అంశాలుంటే దర్యాప్తు చేసుకోవచ్చని ఎలాంటి తప్పులేదన్నారు. పరకామణి కేసుని చిన్న చోరీగా వర్ణించడంపై టీటీడీ భక్తులు మండిపడుతున్నారు. ఈ రెండు కేసులు న్యాయస్థానం ఆదేశాలతో దర్యాప్తు జరిగింది కూడా.