జగన్ నెల్లూరు పర్యటన ఉద్రిక్తంగా మారేలా ఉంది. జైలులో ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన జులై-3న నెల్లూరు రాబోతున్నారు. అయితే కనీసం నెల్లూరులో ఆయన హెలికాప్టర్ దిగేందుకు కూడా ప్లేస్ దొరకకుండా వ్యూహరచన చేస్తున్నారు టీడీపీ నేతలు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ విషయంలో పంతం పట్టారు. జగన్ కి చుక్కలు చూపించాలని డిసైడ్ అయ్యారు. మూడు చోట్ల పర్మిషన్ అడిగితే మూడు చోట్లా అవకాశం లేకుండా చేశారు. ఒకప్పుడు జగన్ కి నమ్మినబంటులా ఉన్న ఆయన ఇప్పుడు ఆయన్ను నెల్లూరులో కాలుపెట్టబోనివ్వనంటూ పంతం పట్టారు.
జగన్ పర్యటనల్లో విషాద ఘటనలు
ఇటీవల జగన్ పర్యటనలన్నీ సంచలనంగా మారాయి. ప్రతిచోటా కార్యకర్తల అత్యుత్సాహం విమర్శలకు దారి తీస్తోంది. ఇటీవల సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జగన్ పర్యటన రోజున ముగ్గురు మృతి చెందారు. సింగయ్య అనే వైసీపీ కార్యకర్త ఏకంగా జగన్ కారు చక్రాల కింద నలిగిపోయాడు. ఈ ఘటనల వల్ల జగన్ పర్యటనలపై తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి. ఆయన పర్యటనలకు అనుమతి ఇచ్చే విషయంలో పోలీసులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ర్యాలీల్లో పరిమిత సంఖ్యలో వాహనాలు ఉండాలని పోలీసులు సూచించినా వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు. బలప్రదర్శన కోసం జనాన్ని తరలిస్తున్నారు. ఈ హడావిడిలో జరగరానిది జరిగితే.. ఆ నిందను ప్రభుత్వంపై వేస్తున్నారు. ఈ దశలో నెల్లూరు పర్యటన ఆసక్తికరంగా మారింది.
నెల్లూరులో ఘర్షణ తప్పదా..
2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2024 వచ్చేనాటికి సీన్ రివర్స్ అయింది. జిల్లా మొత్తం టీడీపీ జెండా రెపరెపలాడింది. జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. ఎన్నికల తర్వాత మరికొందరు కూడా అదే బాట పట్టినా.. ఎన్నికల ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. వైసీపీకి చేసిన డ్యామేజీ అంతా ఇంతా కాదు. బలమైన నేతలు పార్టీ మారడంతోపాటు, వైసీపీకి సహజంగానే తగ్గిన ప్రజాదరణ నెల్లూరులో స్పష్టంగా కనపడింది. అప్పట్లో జగన్ వీరాభిమానిగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఆ తర్వాత ఆయనకు పూర్తి వ్యతిరేకంగా మారారు. పార్టీ మారి, టీడీపీ నుంచి గెలిచి చూపించారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు జగన్ పర్యటనను అడ్డుకోవాలని చూస్తోంది కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డేనని అంటున్నారు వైసీపీ నేతలు.
హెలిప్యాడ్ కి దొరకని చోటు..
నెల్లూరు మొత్తం టీడీపీ హవా ఉంది. ఈ దశలో జగన్ పర్యటనకు వస్తే పర్లేదు కానీ, ఆ పేరుతో బలప్రదర్శన చేయాలని చూస్తే మాత్రం అక్కడ ఉద్రిక్తత నెలకొనడం ఖాయం. వైసీపీ, టీడీపీ నేతల డైరెక్ట్ ఫైట్ ని ఎవరూ ఆపలేరు. అందుకే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇక జగన్ హెలికాప్టర్ లో నెల్లూరుకి రావాలనుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఎన్నోసార్లు ఆయన నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో హెలికాప్టర్ లో దిగారు. అలాంటి జగన్ కి ఇప్పుడు నెల్లూరులో హెలికాప్టర్ లో ల్యాండ్ అయ్యేందుకు స్థలమే దొరక్కపోవడం విశేషం. మూడుచోట్ల హెలిప్యాడ్ కి స్థలం కుదరలేదు. అయితే ఇదంతా టీడీపీ కుట్రేనని వైసీపీ ఆరోపిస్తోంది. ఎవరి పంతం ఎలా ఉన్నా.. జగన్ పర్యటన రోజున గొడవ జరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.