Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఏపీలో నాలుగు కొత్త కేవీఎస్ స్థాపనకు ఆమోదం తెలిపిందని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రకటించారు. మంగసముద్రం(చిత్తూరు), బైరుగనిపల్లె (కుప్పం), పలాస (శ్రీకాకుళం), శాఖమూరు (అమరావతి)లో కొత్త కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చొరవతో గతంలో విద్యాసేవలు అందని ప్రాంతాలలో నాణ్యమైన విద్యను పొందే అవకాశం కలిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వారి పిల్లలకు విద్యాసదుపాయం పెరుగుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 35 కేంద్రీయ విద్యాలయాలు ఉండగా, వాటికి తోడుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం, ములుగు జిల్లా కేంద్రం, జగిత్యాల రూరల్ మండలం చెల్గల, వనపర్తి జిల్లా నాగవరం శివారులో కొత్త కేవీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల స్థాపనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రాథమిక దశ నుండి పిల్లలకు విద్యను అలవాటు చేసే బాల్వటికలను కేవీఎస్ లలో చేర్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. దీంతో ఉద్యోగాల సృష్టితో పాటు, అనేక మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారన్నారు. ఈ నిర్ణయంతో వెనుకబడిన జిల్లాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలు సమ్మిళిత అభివృద్ధి వైపు నడుస్తాయన్నారు.
దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను (కేవీ) స్థాపనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి తొమ్మిది ఏళ్లలో 57 కొత్త కేవీల స్థాపనకు మొత్తం రూ. 5862.55 కోట్ల నిధులు అవసరం అవుతుందని కేంద్రం భావిస్తుంది. NEP-2020 ప్రకారం 57 కేవీలను బాల్వటికాలతో అంటే ప్రీ-ప్రైమరీ స్కూళ్లతో కలిపి ఏర్పాటు చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యావసరాలను తీర్చడానికి దేశవ్యాప్తంగా ఒకే ప్రమాణాలతో నవంబర్ 1962లో కేవీల ఏర్పాటుకు ఆమోదించింది. దీంతో కేంద్ర విద్యాశాఖ “సెంట్రల్ స్కూల్స్ ఆర్గనైజేషన్” అనే ఒక విభాగాన్ని ప్రారంభించింది.
కొత్త కేవీల ఏర్పాటు నిరంతర ప్రక్రియ అని కేబినెట్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, వాటి విభాగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కేవీలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 1288 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 3 విదేశాలలో అంటే మాస్కో, ఖాట్మాండు, టెహ్రాన్ లో ఉన్నాయి. జూన్ 30, 2025 నాటికి మొత్తం 13.62 లక్షల మంది విద్యార్థులు కేవీల్లో చదువుతున్నారు.
డిసెంబర్ 2024లో మంజూరు చేసిన 85 కేవీలతో పాటు కొత్తగా 57 విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ 57 కేవీలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్న 20 జిల్లాల్లో ప్రారంభించనున్నారు. డిసెంబర్ 2024లో మంజూరు చేసిన 85 కేవీల మంజూరుకు కొనసాగింపుగా, మార్చి 2019 నుంచి కవర్ చేయని రాష్ట్రాలకు తాజాగా ప్రాధాన్యత ఇచ్చారు.
దాదాపు 1520 మంది విద్యార్థుల సామర్థ్యంతో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. 57 కేవీ ఏర్పాటుతో 86,640 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. కేంద్రీయ విద్యాలయంలో(బాల్ వాటిక నుంచి 12వ తరగతి వరకు) 81 మంది ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పనిచేస్తుంటారు. 57 కొత్త కేవీల ఆమోదంతో మొత్తం 4617 మంది ఉపాధి లభించనుంది.
జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం 913 కేంద్రీయ విద్యాలయాలను పీఎం శ్రీ పాఠశాలలుగా మార్పుచేశారు. ప్రతి సంవత్సరం కేవీల్లో బాల్ వాటిక, క్లాస్-I కోసం చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. సీబీఎస్ఈ నిర్వహించే బోర్డు పరీక్షలలో కేవీ విద్యార్థులు ప్రతిభ చూపుతున్నారని కేంద్ర తెలిపింది.