Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీ పవన్ కళ్యాణ్ రూ.2 కోట్లు విరాళంగా అందించి.. తొలి సభ్యత్వాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వానికి మూడు ప్రత్యేక గుర్తింపులను ప్రకటించారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని.. సిద్ధాంతాలు , ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వారిని ‘ఉద్యమి’గా పిలుస్తామని తెలిపారు. పార్టీ పోరాటానికి బలాన్ని చేకూర్చి.. యువతను ప్రేరేపిస్తూ సభ్యత్వాలను నమోదు చేయించేవారిని ‘సాధక్’గా పేర్కొన్నారు. అలాగే ప్రజా, రాజకీయ పోరాటాలకు పరోక్షంగా సమయం, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహకారాలు అందించేవారిని ‘ప్రదాత’గా సంభోదిస్తామని వెల్లడించారు.
పార్టీ ప్రారంభ దశలను గుర్తు చేసుకుంటూ.. మొదట 150 మంది సభ్యులతో ప్రయాణం ఆరంభించామని తెలిపారు. 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు చేపట్టినప్పుడు 90 వేల మంది చేరారని.. ఎన్నికల ముందు ఆ సంఖ్య ఆరు లక్షలకు పెరిగిందని చెప్పారు. ఎన్నికల అనంతరం సభ్యత్వాల సంఖ్య 12.98 లక్షలకు చేరడం గర్వకారణమని పేర్కొన్నారు. చిన్న వ్యాపారులు, కూలీలు, చదువుకున్న యువత ఇలా వివిధ వర్గాల వారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములయ్యారని తెలిపారు.
పార్టీ భావజాలాన్ని నిజంగా అర్థం చేసుకొని.. ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వారే పార్టీకి అవసరమని.. అలాంటి వారితోనే బలమైన ఉద్యమాన్ని నిర్మించగలమని శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత సభ్యత్వ నమోదులో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్న జనసేనాని
ఈ సందర్భంగా పార్టీ కోసం పనిచేసే వారిని ఇక నుంచి “ఉద్యమి-సాధక్-ప్రదాత”లుగా పిలుస్తామని ప్రకటించిన పవన్… pic.twitter.com/tJhu9zi6fY
— BIG TV Breaking News (@bigtvtelugu) February 15, 2026