Arava Sridhar MLA: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, జనసేన పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ ముమ్మరం చేసింది.మంగళవారం ఈ కమిటీ ముందు ఎమ్మెల్యే స్వయంగా హాజరయ్యారు. రైల్వేకోడూరుకు చెందిన ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై ఏడాదిన్నరగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని వీడియోల ద్వారా సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో, పార్టీ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజానిజాలను నిగ్గుతేల్చడానికి ఈ విచారణకు ఆదేశించారు.
త్రిసభ్య కమిటీ (టి. శివశంకర్, తంబళ్ళపల్లి రమాదేవి, టి. సి. వరుణ్) సుమారు గంటన్నర పాటు ఎమ్మెల్యేను ఏకాంతంగా విచారించింది. మహిళా ఉద్యోగి విడుదల చేసిన వీడియోలు, సోషల్ మీడియా చాటింగ్లు, ఆడియో కాల్స్ గురించి కమిటీ సభ్యులు ఆయనను ప్రశ్నించారు. సదరు మహిళ తన ఇంటికి ఎమ్మెల్యే తరచూ వచ్చేవాడని చేసిన వ్యాఖ్యలపై, అలాగే ఆమె ఐదుసార్లు అబార్షన్ చేయించుకున్నట్లు చూపుతున్న ఆధారాలపై ఎమ్మెల్యే వివరణ కోరినట్లు సమాచారం. జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర పేరు ఈ వివాదంలో ప్రస్తావనకు రావడంపై కూడా కమిటీ ఆరా తీసింది.
జనవరి 28న ఈ కమిటీ ఏర్పాటైనప్పటి నుండి ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ గడువులో భాగంగానే ఆయన కమిటీ ముందుకు హాజరయ్యారు. ఎమ్మెల్యే తన వద్ద ఉన్న ఆధారాలను, ఫోన్ రికార్డులను కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక కుట్ర అని, సదరు మహిళ తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఎమ్మెల్యే గతంలోనే పేర్కొన్నారు.
ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోంది. కమిటీ నివేదిక సమర్పించే వరకు అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన అధినేత ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆయనపై పార్టీ పరంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: హెల్మెట్ లేదని ఒకే రోజులో రెండుసార్లు ఫైన్.. పోలీస్ స్టేషన్ ఫ్యూజ్ పీకేసిన లైన్మెన్