Janasena: చీటికి మాటికీ జనసేన అధినేత పవన్కల్యాణ్, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు ప్రత్యర్థులు. ఈ విషయంలో గడిచిన రెండేళ్లుగా అదే జరిగింది.. జరుగుతోంది కూడా? అక్కడక్కడ నేతలు ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపై పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇబ్బందులు తప్పవు. ఆ మేరకు అడుగులు వేస్తోంది ఆ పార్టీ.
జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పవన్ కళ్యాణ్పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తక్షణమే ఫిర్యాదు చేసేలా చర్యలు చేపట్టింది. అందుకు సంబంధించి ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అలాగే జనసేన కోసం పోరాడిన కార్యకర్తల కోసం న్యాయపరంగా అండగా ఉండేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా కార్యకర్తల కేసుల పూర్తి వివరాలు సేకరించి కేంద్ర కార్యాలయానికి పంపించాలని జనసేన అధిష్టానం పార్టీ నేతలను ఆదేశించింది. వారికి న్యాయ సహాయం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
పార్టీకి నిరంతరం సేవలందిస్తూ వైసీపీ హయాంలో ఆందోళనలు నిర్వహించిన అనేక మంది నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆయా కేసుల కారణంగా ఇప్పుడు వారంతా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో ఆయా కేసుల విషయమై ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధినేత చెప్పినట్టు హరిప్రసాద్ వివరించారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలపై నమోదైన కేసుల వివరాలు, వాటి స్టేటస్ గురించి సంబంధించి పూర్తి నివేదికను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి ఇవ్వాలని సూచించారు.
కేసుల పరిష్కారానికి అవసరమైన చర్యలు వేగవంతం చేయడమే దీని ఉద్దేశమని అన్నారు. అంతేకాదు పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు అండగా నిలిచేందుకు అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. ఇదే సమయంలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది జనసేన పార్టీ. అధినేత పవన్ గురించి ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేసేలా చర్యలను చేపడుతున్నట్లు స్పష్టం చేసింది.
ALSO READ: శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!
ఈ విషయాన్ని హరిప్రసాద్ వెల్లడించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోనేలా చట్ట ప్రకారం ముందుకు వెళ్దామన్నారు. ఈ లెక్కన రానున్న రోజుల్లో ప్రత్యర్థులకు చుక్కలు తప్పవనే సంకేతాలు ఇచ్చేశారు. ఇప్పటికే ప్రభుత్వం కేసులతో బెంబేలెత్తుతున్న వైసీపీ నేతలకు, జనసేన కూడా అలర్ట్ కావడంతో ఆలోచన పడినట్టు తెలుస్తోంది. మొత్తానికి రానున్న రోజుల్లో రాజకీయాలు క్రమంగా వేడెక్కడం ఖాయం.