Tuni Road Accident: కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక పెళ్లి బస్సును వేగంగా వచ్చిన భారీ కంటైనర్ ట్రాలీ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. తుని మండలం తేటగుంట, రాజులకొత్తూరు సమీపంలో బస్సు అదుపుతప్పి పక్కనే పల్టీ కొట్టి బోల్తా పడింది.
తునిలోని ఓ పెళ్లి బృందం సాయి వేదికలో వివాహ వేడుకను ఘనంగా ముగించుకుని, ఉప్పాడకు తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో పెళ్లికూతురు బంధువులతో సహా దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. లారీ ఢీకొన్న తీవ్రతకు బస్సు బోల్తా పడటంతో లోపల ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రయాణికులు వెంటనే ధైర్యం చేసి బస్సు అద్దాలు పగులకొట్టి బయటకు వచ్చారు.
ఈ ఘటనలో పెళ్లి బృందానికి చెందిన దాదాపు 40 మందికి పైగా తీవ్ర, స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 108 అంబులెన్సుల్లో క్షతగాత్రులను వెంటనే తుని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో బాధితుల కుటుంబసభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: వారణాసిలో చంద్రబాబు జోష్.. మోదీ పాలనపై ప్రశంసల జల్లు!