Kakinada Fire Accident: కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లెలో సంక్రాంతి వేళ ఘోర విషాదం చోటుచేసుకుంది. సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 38 పూరిళ్లు అగ్నికి కాలిబూడిదయ్యాయి. గ్రామస్థులు పండగ సరుకుల కోసం తుని వెళ్లిన సమయంలో.. ఈ ఘోర ప్రమాదం జరిగింది. గ్రామంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గ్రామస్థులు తిరిగి వచ్చేసరికి ఇళ్లు, ధాన్యం, నగదు అన్నీ మంటల్లో కలిసిపోయి.. 120 మంది కట్టుబట్టలతో మిగిలారు. గ్యాస్ లీకై మంటలు వ్యాపించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో 38 తాటాకు ఇళ్లు కాలిపోవడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తాత్కాలిక వసతి, ఆహారం ఏర్పాటు చేసి అన్ని విధాలుగా అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. తక్షణ సహాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. కొత్త ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు.
సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మన్యంలో మారుమూలన ఉండే ఈ తండాలోని 38 పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. 120 మంది కట్టుబట్టలతో మిగిలారు. మంటలు దావానలంలా వ్యాపించి క్షణాల్లో ఊరంతా వ్యాపించడం తీవ్ర విచారకరమని’ వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి ప్రభుత్వం అండగా నిలవాలని, తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ 1 లక్ష అందజేయాలని డిమాండ్ చేశారు. ఇల్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలని, కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు వారికి అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Also Read: మంటల్లో లగ్జరీ బస్సు.. ఆటో డ్రైవర్ హెచ్చరిక, ప్రయాణికులు పరుగో పరుగు