YS Vivekananda Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకానంద రెడ్డి హత్యకేసులో తొలి దర్యాప్తు అధికారి, పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
సీఐ శంకరయ్యను డిస్మిస్ చేసిన ప్రభుత్వం..
కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా వీఆర్లో ఉన్న సీఐ శంకరయ్యను పోలీస్ శాఖ నుంచి డిస్మిస్ చేస్తూ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
నిర్లక్ష్యం, దుష్ప్రవర్తన వల్లే శంకరయ్యను తొలగింపు..
డీఐజీ ఆదేశాల ప్రకారం.. క్రమశిక్షణా చర్యలతో సీఐ శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగించామని.. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. డిస్మిస్ ఉత్తర్వుల్లో శంకరయ్య ప్రవర్తన, డిపార్ట్మెంట్ నిబంధనల ఉల్లంఘనలు, క్రమశిక్షణకు భంగం కలిగించే అంశాలనే ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం.
చంద్రబాబుకు శంకరయ్య పరువు నోటీసులు..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సీఐ శంకరయ్య ఇటీవల పరువు నోటీసులు పంపారు. తనకు డీఎస్పీ ప్రమోషన్ ఇవ్వకపోవడంపై ఇప్పటికే సీఐ శంకరయ్య హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తనకు డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చారని, అసెంబ్లీలో చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలతో తన ప్రతిష్ట దెబ్బతిందని, 1.45కోట్ల పరువు నష్టం పరిహారం చెల్లించాలని కోర్టులో దావా వేశారు. అంతేకాకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలని సీఎం చంద్రబాబుకు శంకరయ్య నోటీసు పంపించారు. ఈ చర్యను చంద్రబాబు సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివేకా హత్య సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య
మరోవైపు వివేకా హత్యకేసులో అప్రూవర్ షేక్ దస్తగిరిని జైల్లో బెదిరించిన కేసులో నాటి కడప జైలు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డిని వైద్యశిబిరం నిర్వహణ ముసుగులో జైల్లోకి అనుమతించి.. నాటి కడప జైలు సూపరింటెండెంట్ ఐఎన్హెచ్ ప్రకాశ్, డిప్యూటీ సూపరింటెండెంట్ కె.జవహర్బాబు, డీసీఎస్ డా.జి.పుష్పలత ముగ్గురూ విధినిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యానికి, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని అభియోగాలు మోపింది.
Also Read: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం..! ఏ క్షణమైనా నోటిఫికేషన్ రిలీజ్
విచారణాధికారిగా కోస్తాంధ్ర రీజియన్ జైళ్లశాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసు ప్రెజెంటింగ్ అధికారిగా రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ రాహుల్ను నియమించింది. మూడు నెలల్లోగా విచారణ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం ఐఎన్హెచ్ ప్రకాశ్ నెల్లూరులోని ఏపీ స్టార్స్లో, జవహర్బాబు విశాఖపట్నం కేంద్ర కారాగారంలో, డా పుష్పలత కడప జీజీహెచ్లో పనిచేస్తున్నారు.