Konaseema Blowout: కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ మంటలు ఇంకా ఆగలేదు. ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ బ్లోఅవుట్ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. వరుసగా నాలుగో రోజూ మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ నెల 5న ఓఎన్జీసీ సైట్ నుంచి గ్యాస్ లీకై భారీగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం మంటల ఉద్ధృతి తగ్గినప్పటికీ ఇంకా అదుపులోకి రాలేదు. ప్రమాద స్థలానికి 10 మీటర్ల దగ్గరకు వెళ్లి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. నిరంతరాయంగా నీటిని పంప్ చేస్తున్నారు. బ్లోఅవుట్ అదుపులోకి వచ్చేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం ఇరుసుమండలో సోమవారం ఓఎన్జీసీ గ్యాస్ లీకైంది. గ్యాస్ తీవ్రతతో వంద అడుగుల మేర మంటలు ఎగిసిపడ్డాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓఎన్జీసీ సిబ్బంది పరుగులు తీశారు. మంటలు పెరగడం, గ్యాస్ లీకేజీ ఎక్కువగా ఉండడంతో గ్రామస్థులను ఖాళీ చేయించారు. ఇరుసుమండ గ్రామంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు తీవ్రతకు వందలాది కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయి.
పచ్చని కోనసీమలో పదే పదే గ్యాస్ లీక్ అవుతున్న ఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇరుసుమండ మరో పాశర్లపూడి అవుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గోదావరి జిల్లాల్లో చమురు నిక్షేపాల వెలికితీత దశాబ్దాలుగా కొనసాగుతోంది. గ్రామాలు, పొలాలు, ఇళ్ల మధ్య నుంచి గ్యాస్ పైపులైన్లు ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో.. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
Also Read: బ్లో అవుట్ ముప్పు! భయం గుప్పిట్లో కోనసీమ ప్రజలు
2014లో మామిడికుదురు మండలం నగరం గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత భద్రత చర్యలపై కొన్నిరోజులు పాటించి ఆ తర్వాత పక్కన పెట్టేశారు. తాజాగా ఇరుసుమండలో బ్లోఅవుట్ నివాస ప్రాంతాల్లో జరిగితే ఏంటి పరిస్థితి ప్రశ్నలు తలెత్తున్నాయి. కోనసీమ జిల్లాలో ప్రస్తుతం 217 ప్రాంతాల్లో చమురు వెలికితీత పనులు జరుగుతున్నాయి. బ్లోఅవుట్ చాలా చిన్నదని, చమురు వెలికితీతతో భూమి పొరల్లో భారీ విధ్వంసం జరుగుతోందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిగ్ పేరుతో కిలోమీటర్ల మేర తవ్వి, తిరిగి పూడ్చకుండా వదిలేస్తున్నారని అంటున్నారు.