ఏపీ, తెలంగాణ నడుమ జలజగడం రాజుకుంది. ప్రస్తుతం ఇదే అంశంపై రెండు రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు అధికారపార్టీలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు శిష్యుడు ఏపీకి నదీ జలాలు పంపిస్తూ రాష్ట్రాన్ని ఎండబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని అందుకే ఏపీ ప్రజలను మోసం చేసేలా ప్రాజెక్టుల నిర్మాణంలో ఎటువంటి నిర్ణయాలు ముందుకు కదలడం లేదని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్నది.
ఏపీలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పోలవరం నుంచి గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఏపీ బనకచర్లను ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం చెప్పడంతో కేంద్రం సైతం ఆ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయలేదు. తాజాగా నల్లమల సాగర్ లింకు పేరుతో కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ప్రాజెక్టు గనుక పూర్తయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఆరోపిస్తున్నది. దీనిపై కేంద్రానికి రేవంత్ సర్కార్ ఇప్పటికే ఫిర్యాదు సైతం చేసింది. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నది.
తెలంగాణలో ఏపీ కడుతున్న నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్దఎత్తున ప్రభుత్వాన్ని నిందించడంతో రేవంత్ సర్కార్ సైతం తమ మీద పడిన అపవాదును తీసేసుకోవడానికి సుప్రీంకోర్టులో ఈ ప్రాజెక్టుపై పిటిషన్ వేసింది. తమ అనుమతి లేకుండా ఏపీ కట్టడానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని, ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సోమవారం తెలంగాణ సర్కార్ వేసిన పిల్ మీద విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. ఏపీ వాదనలనూ పరిగణలోకి తీసుకుంది. రాష్ట్రం తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. ఇప్పటికే నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక వచ్చాక తమ అభిప్రాయం చెబుతామని పేర్కొంది. అంతేకాకుండా పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ క్లియర్ చేసుకోవాలని సైతం సూచన చేసింది.
కృష్ణా, గోదావరి నదీ జలాలపై నెలకొన్న వివాదాలను సుప్రీం కోర్టు, ట్రిబ్యునల్ను ఆశ్రయించే బదులు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ చోట కూర్చుని పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటే మంచిదని పలుఅభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపుల ఆధారంగా.. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాల ప్రయోజనాల కోసం కూర్చుని మాట్లాడుకుంటేనే పరిష్కారం దొరుకుతుందని సీపీఐ నారాయణ అభిప్రాయపడ్డారు. ఆయన వలే జల నిపుణులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. కోర్టులకు వెళ్లడం ద్వారా కాలయాపన తప్ప ఏమీ ఉండదని అంటున్నారు. ఇటీవల సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఏపీ సీఎంతో జలవివాదాలపై చర్చిస్తానని చెప్పగా.. చంద్రబాబు సైతం దీనికి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది. త్వరలోనే రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యి నదీ జలాలపై చర్చిస్తే ఏపీ, తెలంగాణలో ఏర్పడిన గందరగోళానికి చెక్ పెట్టినట్టు అవ్వడమే కాకుండా ప్రతిపక్షాల నోర్లు సైతం మూయించినట్టు అవుతుందని అధికార పార్టీల నేతలు అభిప్రాయ పడుతున్నారు.