Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెవెన్యూ అధికారుల అండదండలతో సాగుతున్న నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిబంధనల నియామాలను తొక్కి, అనర్హులకు సైతం అధికారిక పత్రాలు జారీ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు ప్రభుత్వ యంత్రాంగంపై పలు విమర్శలకు తావిస్తున్నాయి.
ముఖ్యంగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇక్కడి స్థానికతను చూపుతూ నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాలు (రెసిడెన్సీ సర్టిఫికేట్స్) పొందినట్లు స్పెషల్ బ్రాంచ్ (SB) పోలీసుల విచారణలో తేలింది. ఈ తప్పుడు పత్రాలను ఉపయోగించి వారు ఏకంగా కేంద్ర సాయుధ బలగాల్లో (Central Armed Forces) ఉద్యోగాలు కూడా సంపాదించారు. అయితే, నియామక ప్రక్రియలో భాగంగా అధికారులకు అనుమానం వచ్చి లోతుగా విచారించడంతో, అసలు విషయం బయటపడి జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అంతేకాకుండా తాజాగా రేగొండ తహశీల్దార్ కార్యాలయం వేదికగా మరో విస్తుపోయే నిజం వెలుగు చూసింది. కాటరం మండలం గుండ్రాత్పల్లికి చెందిన ఓసీ సామాజిక వర్గానికి చెందిన తోటపల్లి సావిత్రి అనే మహిళ, బీసీ-బి కుల ధ్రువీకరణ పత్రం పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హత లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు ఈ సర్టిఫికేట్ జారీ కావడం వెనుక కార్యాలయ సిబ్బంది హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: రూ.3 వేల కోట్ల భారీ స్కామ్.. ‘సాహితీ’పై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
అలాగే, ఈ నకిలీ బీసీ సర్టిఫికేట్ను ఉపయోగించుకుని ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ మహిళా రిజర్వేషన్ స్థానం నుండి పోటీ చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం కుల ధ్రువీకరణ పత్రాలను దుర్వినియోగం చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.