Amaravati: ఏపీలోవివిధ కార్యక్రమాల పేరిట యాక్టివేట్ అవుతోంది వైసీపీ. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో పెంచిన పెట్రోల్-డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ లైన్లోకి వచ్చారు.
వైసీపీపై కూన రవికుమార్ ఎదురుదాడి
పెంచిన పెట్రోల్-డీజిల్ ధరల ఛార్జీలపై వైసీపీ చేస్తున్న ఆందోళనలు ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో ధరల పెంపును ఈ సందర్భంగా ప్రస్తావించారు.
2019-24 వరకు వైసీపీ పాలనలో పెట్రోలు-డీజిల్పై అధిక భారం మోపిందని ఆరోపించారు. ఆనాడు ఐదేళ్లలో ఏకంగా రూ.41 పెంచారని వివరించారు. 2014-19 మధ్య టీడీపీ పాలనలో కేవలం రూ.13 పెంచారని గుర్తు చేశారు. ఆనాడు కేంద్రం ధరలు పెంచితే చంద్రబాబు ప్రభుత్వం ఆదాయాన్ని తగ్గించుకుని ప్రజలకు రూ.2 ఉపశమనం కల్పించారని తెలిపారు.
ఆందోళన నాటకాలు ఆపండి.. మీ హయాంలో ఏం చేశారో తెలీదా?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్పై వ్యాట్ను 31 నుంచి 35 శాతానికి పెంచారన్నారు. డీజిల్పై 22.25 నుంచి 27 శాతానికి పెంచిందని గుర్తు చేశారు సదరు ఎమ్మెల్యే. అదనంగా లీటర్కు ఫిక్స్డ్ వ్యాట్, రోడ్ డెవలప్మెంట్ సెస్ పేరుతో భారం మోపారంటూ వైసీపీ చిట్టా విప్పారు.
రోడ్ల అభివృద్ధి పేరుతో వేల కోట్లు వసూలు చేసినా కనీసం గుంతలు పూడ్చలేదన్నారు. వైసీపీ పాలనలో ఏపీ అత్యధిక ఇంధన ధరలున్న రాష్ట్రంగా మారిందన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే లీటర్కు రూ.5 నుంచి రూ.10 వరకు అధనంగా వసూలు చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ALSO READ: లోకేష్ పేరు ‘లవ్ కాష్’ అయితే బాగుంటుంది.. గుంటూరు నిరసనలో అంబటి సెటైర్లు!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ పడిపోవడం, ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న కారణాలతో ఇంధన ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. వాస్తవాలను దాచిపెట్టి కూటమి ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేయడంపై రుసరుసలాడారు కూన రవికుమార్.
బాదుడే బాదుడు కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గొడ్డలి పార్టీ అని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా వ్యాట్ గానీ సెస్ గానీ పెంచలేదన్నారు. వైసీపీ కార్యకర్తలు నిజంగా ప్రజల పక్షాన పోరాటం చేయాలనుకుంటే గతంలో భారం మోపిన జగన్ నివాసం ముందు ధర్నా చేయాలని సూచించారు.