Pithapuram: కాకినాడ జిల్లాలోని పిఠాపురం మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్ల నిధులు స్వాహా చేసినట్లు ఐదుగురు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. అభివృద్ధి పనులు చేపట్టకుండానే బిల్లులు పాస్ చేసుకున్నట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో బయటపడింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం ద్వారా పిఠాపురం మున్సిపాలిటీకి 7.73 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. వీటిలో రూ.3.10 కోట్ల విలువైన 28 పనులు పూర్తి చేసినట్లు చూపించారు.
కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ఇంజినీరింగ్ అధికారులు పనులు చేయకుండానే బిల్లులు మంజూరు చేశారు. పలు నిర్మాణాలలో నాణ్యతా లేకుండా నాసిరకంగా నిర్మించారంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించగా, పలు లోపాలను గుర్తించి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా, గతంలో పురపాలక సంఘంలో విధులు నిర్వహించిన పలువురి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ చర్యలపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తదుపరి ఆదేశాలు జారీ చేశారు. కోట్ల రూపాయల అవినీతి కారణంగా ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
పిఠాపురం మున్సిపాలిటీలో అవకతవకలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఐదుగురు అధికారులపై వేటు వేసింది. గతంలో అసిస్టెంట్ ఇంజినీర్లు పనిచేసిన వంశీ అభిషేక్, కె.రత్నవల్లి, డీఈఈ భవానీ శంకర్, ఎం టీ హుస్సేన్, పబ్లిక్ హెల్త్ ఈఈ నరసింహరావుపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 7.73 కోట్లు 55 పనులు మంజూరు కాగా పలు వార్డుల్లో రూ.3.19 కోట్ల విలువైన 28 పనులు డ్రైన్లు, సీసీ రోడ్లు పూర్తి చేశారు. నిర్మాణంలో నాణ్యత లోపం, పనులు చేయకుండానే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై బిల్లులు చెల్లించడంపై ప్రభుత్వం ఐదుగురు అధికారులపై వేటు వేసింది. ఇంజినీరింగ్ అధికారులు నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.