Ramprasad Reddy on YCP: అన్నమయ్య జిల్లా రాయచోటిలోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని.. చంద్రబాబు నాయుడికున్న అంతర్జాతీయ గుర్తింపు కారణంగానే పెట్టుబడులు ఏపీ వైపు చూస్తున్నాయని తెలిపారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో హిట్లర్, ముసోల్ని తరహా పాలన సాగిందని.. అందుకే పెట్టుబడిదారులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారని విమర్శించారు.
అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి, జోగి రమేష్లపై మంత్రి నిప్పులు చెరిగారు. అంబటి రాంబాబును సంక్రాంతికి వచ్చే బుడబుక్కలవాడితో పోల్చడమే కాకుండా.. జగన్ అతడిని ఒక టిష్యూ పేపర్ లాగా వాడుకుంటారని ఎద్దేవా చేశారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుపై నీచమైన వ్యాఖ్యలు చేయడం అంబటి కండకావరానికి నిదర్శనమని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా పారిపోతున్నారని విమర్శించారు.
జోగి రమేష్ గతంలో దొంగ లిక్కర్, సారా స్కామ్లలో జైలుకు వెళ్లి వచ్చినా పశ్చాత్తాపం లేకుండా లోకేష్పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గత ఐదేళ్లలో చేసిన అక్రమ దందాలు, రాయబారాలు త్వరలోనే బయటపడతాయని.. ‘మా నెంబర్ ఎప్పుడు వస్తుందా’ అని ఎదురుచూసే నేతలందరి జాతకాలు త్వరలో తేలుస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదని గత 20 నెలలుగా సహనంతో ఉన్నామని, కానీ వైసీపీ నేతలు పిచ్చి కుక్కల్లా మొరుగుతూ కవ్వింపు చర్యలకు పాల్పడితే, ఎక్కడ మాట్లాడితే అక్కడికే వచ్చి బుద్ధి చెబుతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.
Also Read: ఇదేనా మీ రూల్ ఆఫ్ లా? వాళ్ల పేర్లు చెబుతూ.. మండిపడ్డ రోజా