Liquid Ganja: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో భారీగా లిక్విడ్ గంజాయి కలకలం రేపింది. చింతపల్లి పోలీసులు నిర్వహించిన వ్యూహాత్మక తనిఖీల్లో కోట్లాది రూపాయల విలువైన మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారంతో చింతపల్లి పోలీసులు లోతుగెడ్డ బ్రిడ్జి సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక బైక్పై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా.. వారి వద్ద ఉన్న స్కూల్ బ్యాగులో ఉన్న నిషిద్ధ లిక్విడ్ గంజాయిని చూసి షాక్ అయ్యారు. సుమారు 11.440 కిలోల బరువున్న ఈ హషీష్ ఆయిల్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 1 కోటి 43 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న లమ్మడంపల్లి గ్రామానికి చెందిన బోనంగి జకరియా, బోనంగి ధనబాబు లను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి లిక్విడ్ గంజాయితో పాటు ఒక బైకు , రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఈ ముఠాలో కీలక సూత్రధారిగా భావిస్తున్న బోనంగి మార్క్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితులు రోలగడ్డ శివారు ప్రాంతాల నుండి ఈ గంజాయిని సేకరించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
పోలీసుల కళ్లు గప్పేందుకు నిందితులు అత్యంత తెలివిగా స్కూల్ బ్యాగులను రవాణాకు ఉపయోగించడం గమనార్హం. పట్టుబడిన నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వినోద్ బాబు, ఎస్సై వీరబాబు వివరాలు వెల్లడించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరించారు.
Also Read: నువ్వు తోపు బాస్..! కాటేసిన పాముతో హాస్పిటల్కి..