Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ని అన్నివిధాలుగా మొదటి స్థానంలో నిలబెట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు మంత్రి లోకేష్. కొన్నిచోట్ల రెండో ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉత్తరాంధ్ర ప్రజలు సహాయం అవసరమని నొక్కి వక్కానించారు.
వచ్చేనెలలో భోగాపురం ఎయిర్పోర్టు ట్రయిల్ రన్
మంగళవారం విశాఖలో దేశంలో మొదటి ఏవియేషన్-ఏరోస్పేస్-డిఫెన్స్-AAD ఎడ్యుకేషన్ సిటీ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేశారు మంత్రి లోకేష్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన, సివిల్ ఏవియేషన్ రంగంలో ప్రపంచంలో 25 శాతం మంది తెలుగువారు ఉండాలి అనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా చెప్పారు.
అనేక దేశాల్లో ఉన్న యూనివర్సిటీలను కలిసి వారిని కూడా భాగస్వామ్యం చేస్తామన్నారు. ఎడ్యుకేషన్- ఇండస్ట్రీ కలిపి అభివృద్ధి చేస్తామన్నారు. క్లస్టర్ బేస్లో అప్రోచ్ అవుతున్న దేశం చైనా అని, దాన్ని ఆదర్శంగా తీసుకుని ఏపీలో పని చేస్తున్నట్లు వివరించారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నామని, ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు.
టార్గెట్ ఫిక్స్ చేశామన్న మంత్రి లోకేష్
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం సమయంలో కొంతమంది ఎగతాళి చేశారని, కేవలం ఎయిర్ పోర్టుకు 5వేల ఎకరాలు అవసరమా అని ప్రశ్నించారని గుర్తు చేశారు. ఇప్పుడు దాని విలువ వారికి అర్థమైందన్నారు. ఒక గజం భూమి కోసం కొట్టుకుంటున్న ఈ రోజుల్లో వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను గజపతి కుటుంబం ఇస్తుందన్నారు.
ఒక్క రూపాయి తీసుకోకుండా భూములు ఇస్తున్న అంత గొప్ప కుటుంబమని అన్నారు. బీహార్లో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారంకి వెళ్ళామని, గడిచిన 18నెలల్లో ఏపీలో ఒక మ్యాజిక్ జరుగుతుందని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
మెసైల్స్-జీపీఎస్ రెండు కలిసి పని చేస్తున్నాయని, తలసరి ఆదాయం తక్కువగా ఉండడంతో అహర్నిశలు కష్ట పడుతున్నామని తెలిపారు. చాలా ఐటీ కంపెనీలు భీమిలి ప్రాంతానికి వస్తున్నాయని వివరించారు. అటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు.
ALSO READ: టీటీడీ పరకామణి కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఉత్తరాంధ్ర ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతమని, వలసలు ఎక్కువగా ఉండేవన్నారు. కేవలం 18 నెలల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి వల్ల అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారిందన్నారు. వలసలకు మనం వెళ్ళే రోజుల నుండి.. మన వద్దకు ప్రపంచం వచ్చే విధంగా తీర్చిదిద్దారని తెలియజేశారు.
పౌర విమానయానం అత్యంత ప్రాముఖ్యత కలిగిన విభాగమని, ఇది అత్యంత ప్రాముఖ్యత కలగడానికి ప్రధాని మోడీ ప్రధాన కారణమన్నారు. ప్రతీ ఏడాది 12 శాతం గ్రోత్ రేట్ ఉందంటే.. దాని వెనుక అప్పటి కేంద్రమంత్రి, గవర్నర్ అశోక్ గజపతిరాజు కీలకమైన పాత్ర పోషించారన్నారు.
అగ్రికల్చర్,ఇన్ఫ్రా, ఏవియేషన్ వంటి అనేక రంగాలపై సీఎం చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందన్నారు. రాబోయే 30, 40 ఏళ్ల తర్వాత ఎలాంటి అవసరాలు ఉంటాయో ఇప్పుడు ఆలోచన చేస్తున్నారని తెలిపారు. యూనివర్సిటీని ఎడ్యుసిటీగా మార్చామని, ప్రపంచంలో ఏ యూనివర్సిటీనైనా ఇందులోకి తేవచ్చన్నారు.
నెల రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్టులో ట్రయల్స్ జరుగుతాయని, జూలైలో ఎయిర్పోర్టు నుంచి సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం పౌరవిమానయాన రంగంలో 800 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయన్నారు. 1700 ఎయిర్ క్రాఫ్ట్లకు ఆర్డర్ సంబంధిత సంస్థలు ఇచ్చాయని తెలిపారు. ఒక్కో ఎయిర్ క్రాఫ్ట్కి వందలాది ఉద్యోగాలు వస్తాయన్నారు.