TTD Parakamani Case: టీటీడీ పరకామణి వ్యవహారంలో ఏపీ హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ఆలయంలో విరాళాల లెక్కింపులో చోటుచేసుకున్న అవకతవకలు.. అత్యంత తీవ్రమైనవని కోర్టు వ్యాఖ్యానించింది. పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించింది అని అభిప్రాయపడింది. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించలేమని స్పష్టం చేసింది.
టీటీడీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించడం సమంజసం కాదని స్పష్టంగా వ్యాఖ్యానించింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తి స్థాయి బాధ్యతాభావం ఉండదు. వారి నియామకం వల్లే పరకామణిలో ఇలాంటి ఘటన జరిగింది అని హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.
అంతేకాదు, ఆధునిక సాంకేతికతను వినియోగించడంలో టీటీడీ వెనుకబడి ఉందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవస్థానాల్లో ఒకటైన టీటీడీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక టెక్నాలజీని ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రశ్నించింది. విరాళాల లెక్కింపు, భద్రత, పర్యవేక్షణ వంటి అంశాల్లో AI ఆధారిత వ్యవస్థలను అమలు చేస్తే మానవ తప్పిదాలు, అక్రమాలకు తావు ఉండదని కోర్టు సూచించింది.
విరాళాల కౌంటింగ్ ప్రక్రియపై కూడా హైకోర్టు కీలక సూచనలు చేసింది. లెక్కింపు సమయంలో ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేయాలని, స్పష్టమైన విధివిధానాలు ఉండాలని ఆదేశించింది. అంతేకాదు విరాళాల లెక్కింపులో భక్తులను ఎందుకు భాగస్వాములను చేయకూడదు? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. భక్తుల సమక్షంలో కౌంటింగ్ జరిగితే పారదర్శకత పెరుగుతుందని, నమ్మకం మరింత బలపడుతుందని అభిప్రాయపడింది.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు విజిలెన్స్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని హైకోర్టు సూచించింది. ఏదైనా తప్పు జరిగిన వెంటనే అప్రమత్తమయ్యే స్మార్ట్ విజిలెన్స్ టెక్నాలజీని తీసుకురావాలని, రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థను అమలు చేయాలని సూచనలు చేసింది.
ఈ వ్యవహారంలో టీటీడీ పాలక మండలి, అధికారుల బాధ్యతపై కూడా.. హైకోర్టు పరోక్షంగా ప్రశ్నలు లేవనెత్తింది. కోట్ల రూపాయల విరాళాలను నిర్వహించే వ్యవస్థలో ఇంతటి నిర్లక్ష్యం ఎలా చోటుచేసుకుందన్నది సమాధానం చెప్పాల్సిన అంశమని పేర్కొంది. అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని కఠిన ఆదేశాలు జారీ చేస్తామని కూడా హైకోర్టు సంకేతాలు ఇచ్చింది.
Also Read: తెలియదు..గుర్తులేదు.. రఘురామరాజు కేసులో నోరువిప్పని A1 సునీల్
పరకామణి కేసుపై తదుపరి విచారణను శుక్రవారం వరకు వాయిదా వేస్తూ, అప్పటికి టీటీడీ తీసుకున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలపై పూర్తి నివేదిక సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.